విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు: విద్యాశాఖ - తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో వాదనలు

13:15 June 23
విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు: విద్యాశాఖ
జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించగా... రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.
ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న సందీప్ కుమార్ సుల్తానియా... ఆన్లైన్ బోధన కూడా కొనసాగుతుందన్నారు. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.