తెలంగాణ

telangana

ETV Bharat / state

CT Scan: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు - CT scan equipment set up in government hospitals

త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సీటీస్కాన్ (CT Scan)​ పరికరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండగా.. మరో 16 నెలకొల్పాలనే యోచనలో ఉంది. అదే విధంగా 108 వాహన సేవల నిర్వహణకు సంబంధించి టెండరు ప్రక్రియను త్వరలో చేపట్టడానికి సన్నద్ధమవుతోంది.

CT Scan
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్

By

Published : Jul 3, 2021, 12:18 PM IST

అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీటీ స్కాన్‌ పరికరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రులు సహా కొన్ని జిల్లా దవాఖానల్లో ఈ పరికరాలు అందుబాటులో ఉండగా.. కొత్తగా మరో 16 నెలకొల్పాలనే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ‘సీటీ స్కాన్‌’ను ప్రారంభించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో అదనంగా ఒక్కోటి చొప్పున నెలకొల్పనున్నారు. ఇవి కాకుండా నిలోఫర్‌, టిమ్స్‌, నల్గొండ, సంగారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక సీటీ స్కాన్‌ పరికరాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తయినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఈ 9 చోట్ల పరికరాల కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా.. త్వరలో అందుబాటులోకి తీసుకురావడమే మిగిలినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఇటీవల ఒక ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ వైద్యఆరోగ్యశాఖకు రూ.15 కోట్లను విరాళంగా అందజేయడానికి ముందుకొచ్చింది. ఆ విరాళాన్ని నగదు రూపంలో కాకుండా సీటీ స్కాన్‌ పరికరాలు అందజేయాలని కోరగా.. సదరు సంస్థ కూడా అందుకు అంగీకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాల సమాచారం మేరకు.. విరాళ మొత్తంతో మరో 7 అత్యాధునిక ‘సీటీ స్కాన్‌’లను కొనుగోలు చేయొచ్చు. వీటిని ఛాతీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి, తాండూరు తదితర 7 ఆసుపత్రుల్లో నెలకొల్పాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో త్వరలోనే 16 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ సాధ్యమైనంత వేగంగా సీటీ స్కాన్‌ పరికరాలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖను ఆదేశించింది. తద్వారా రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులతోపాటు జిల్లా ఆసుపత్రుల్లో ‘సీటీ స్కాన్‌’లు అందుబాటులోకి వస్తాయని వైద్యఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

‘108’ వాహనాల నిర్వహణపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం!

రాష్ట్రంలో అత్యవసర వాహన(108) సేవల నిర్వహణకు సంబంధించి టెండరు ప్రక్రియను త్వరలో చేపట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. నియమ నిబంధనల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ సమక్షంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులతో ఈ మేరకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో 108 అంబులెన్సుల నిర్వహణ తీరును అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా రిజ్వీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ నిర్వహణ సంస్థ పనితీరును సమీక్షించి.. అనుభవాన్ని ప్రాతిపదికగా చేసుకొని బాధ్యతలు అప్పగిస్తుండగా.. తాజా టెండరు ప్రక్రియలో కొన్ని కీలక సవరణలు చేసినట్లుగా సమాచారం.

ప్రతి సంస్థ పవర్‌ పాయింట్‌ ద్వారా తమ అనుభవాన్ని, నిర్వహణ విధానాలను వైద్యశాఖ ముందు ప్రదర్శించాలి. ఈ ప్రదర్శనకు 400 మార్కులు పెట్టారు. నిర్వహణ సంస్థలో పనిచేసే ఉద్యోగుల హోదాలు, వారి అర్హతలకు మరో 150 మార్కులు కేటాయించగా.. మిగిలిన 450 మార్కులను సంస్థ అనుభవానికి, గత పనితీరుకు పరిగణనలోకి తీసుకోవాలనీ.. అలా మొత్తంగా 1000 మార్కుల ప్రాతిపదికన నియమ నిబంధనలను కొత్తగా రూపొందించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాతే టెండరు ప్రకటన వెలువడుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘108’ వాహన సేవలు నిర్వహిస్తున్న అత్యవసర వైద్య సేవలు, పరిశోధన సంస్థ(ఈఎంఆర్‌ఐ)తో ప్రభుత్వం ఒప్పందం గడువు దాదాపు మూడేళ్ల కిందటే ముగిసింది. అయినా, వేర్వేరు కారణాల వల్ల టెండరు ప్రక్రియ నిర్వహణ వాయిదాపడుతూ వస్తుండటంతో ఆ సంస్థే సేవలను అందిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి:ఆ రెండు లక్షణాలతో కొవిడ్​ బాధితుల్లో తీవ్ర ముప్పు!

ABOUT THE AUTHOR

...view details