వెనక్కి తగ్గమంటున్న ప్రభుత్వం, కార్మిక సంఘాలు... ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం... కార్మిక సంఘాలు ఎవరూ తగ్గటం లేదు. సర్కారు చేసిన హెచ్చరికలు పట్టించుకోకుండా కార్మిక సంఘాలు సమ్మె బాటలోనే నడిచాయి. రెండో రోజు సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా అధికారులు ప్రత్యమ్మాయాలను మెరుగుపరిచారు. కొంతవరకు జనాల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేశారు. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెడుతూ సమ్మెకు దిగిన ఉద్యోగులది ముమ్మాటికీ తప్పిదమే అంటూ సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి తీసుకునే ప్రసక్తేలేదంటూ... సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సమ్మె మరింత ఉద్ధృతం...
సీఎం కేసీఆర్ ప్రకటన వెలువరించిన అనంతరం సమ్మె మరింత ఉద్ధృతం చేయనున్నట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలను కలిశామని... అందరూ తమకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. రెండో రోజు సమ్మెలో భాగంగా డిపోల వద్ద బతుకమ్మలు ఆడుతూ నిరసన వ్యక్తం చేసిన కార్మికులు... తమ ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కార్మిక సంఘాలు నేడు ఇందిరాపార్కు వద్ద దీక్ష చేసేందుకు పూనుకున్నారు. కానీ... దీక్షకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
అటు కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హౌజ్మోషన్ కింద విచారించిన న్యాయమూర్తి... ఈ నెల 10లోగా క్షేత్రస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఇదీ చూడండి : ఇంటిబాట పట్టిన నగర వాసులు