దక్షిణ భారత దేశంలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి లేకపోవడం, దిగుమతులే కీలకం అయినందున అక్రమార్కులు.. స్మగ్లింగ్ను కీలకంగా మార్చుకున్నారు. ఇలా ఇతర దేశాల నుంచి దొంగచాటుగా తీసుకొచ్చే బంగారంలో ఎక్కువ భాగం హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు చేరుతుంది.
పన్ను ఎగవేసేందుకు...
బంగారం దిగుమతి చేసుకోవడాన్ని నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం 38.5 శాతం ఎక్సైజ్ సుంకం విధించింది. జీఎస్టీ మరో మూడు శాతం చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి తెచ్చిన బంగారం విలువపై ఎక్సైజ్ సుంకం, జీఎస్టీలు చెల్లిస్తే... స్థానిక ధరలతో సమానంగా కాని, ఎక్కువగానీ ఉంటుంది. అందువల్ల కొన్ని సార్లు నష్టం జరుగుతోంది. అందుకే విదేశాల నుంచి దొంగచాటుగా తీసుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 40 శాతం పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు అక్రమార్కులు.
ధర పెరిగే... ఛాన్స్ దొరికే
ఇటీవల పసిడి ధర పది గ్రాములు 45 వేల వరకు పెరగడం కూడా స్మగ్లర్లను మరింత ప్రేరేపిస్తోంది. బంగారం పట్టుబడినా అసలు సూత్రధారులు దొరకకుండా మధ్యవర్తులను ఉపయోగించి స్మగ్లింగ్ చేయిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు విమానాశ్రయాల్లో డీఆర్ఐ, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ అధికారుల నిఘాను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తమ ఎత్తులను మార్చుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.