తెలంగాణ

telangana

ETV Bharat / state

Ashada Masam Bonalu 2023 : ఆషాఢమాసం బోనాల జాతర షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం - గోల్కొండ బోనాలు ప్రారంభం

Golconda Bonalu 2023 in Telangana : మహంకాళి, జగదాంబిక జాతర బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ బోనాలు ప్రారంభం నేపథ్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈసారీ రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. అనంతరం గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు పూజారికి సమర్పించడంతో పాటుగా ఊరేగింపులో కూడా మంత్రులు పాల్గొన్నారు.

Golconda Bonalu
Golconda Bonalu

By

Published : Jun 22, 2023, 8:14 PM IST

Golconda Ellamma Bonalu Started Today : చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఈ మేరకు లంగర్​హౌస్‌ వద్ద జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు.. మంత్రులకు పట్టువస్త్రాలను అందజేశారు.

ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు.. మొదటి బోనం గోల్కొండ ఎల్లమ్మకే

అనంతరం లంగర్‌హౌస్‌ నుంచి బోనాల తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ బడాబజార్‌, ఛోటా బజార్‌ల మీదుగా కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలి పూజ ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చాక రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకొంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. భారత దేశంలో హిదువుల గురించి మాట్లాడతారు కానీ.. హిందువుల పండుగలకు సహకరించేది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. రానున్న బోనాల పండుగకు పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలన్నారు.

"రాష్ట్రంలోని 3036 దేవాలయాలకు రూ.11 కోట్లను ఖర్చు చేశాం. ఇవాళ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమర వీరుల జ్యోతి వెలిగించి.. దానితో పాటు బోనాలు కూడా ప్రారంభమౌతాయి. ప్రజలందరూ.. సహకరించి పండుగను నిర్వహించుకోవాలి. బోనాల పండుగకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించారు. నెల రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఈ ఏడాది అట్టహాసంగా జరగబోతుంది." -ఇంద్రకరణ్‌ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి

Golconda Bonalu In Hyderabad : పట్టు వస్త్రాలు, బంగారు బోనం, తొట్టెల ఊరేగింపుతో లంగర్‌హౌస్‌ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న బోనాలు పండుగ మొదటి పూజ అట్టహాసంగా సాగింది. లంగర్‌ హౌస్‌ నుంచి గోల్కొండ వరకు జరిగిన బోనాల ఊరేగింపులో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బోనాల పండుగ శుభాకాంక్షలు : గోల్కొండ ఆషాఢ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని.. దీని ద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సీఎం పేర్కొన్నారు. తరతరాల తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజ‌ల‌పై ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని సీఎం కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details