ఆర్థిక కష్టాలు జీహెచ్ఎంసీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా ఆర్థిక విభాగం పీఆర్సీ ఉత్తర్వును అమలు చేయలేక పోతుండటమే అందుకు నిదర్శనం. గతంలోని లేని విధంగా పెండింగు ఇంక్రిమెంట్లను సరిచేశాకే పీఆర్సీ బిల్లులు చేయాలని నిబంధనను తెరపైకి తెచ్చింది. పొరుగు సేవల సిబ్బంది పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆ ఉద్యోగులకూ పీఆర్సీని వర్తింపజేయాలని సర్కారు ఆదేశిస్తే.. వారి జీతాలను న్యాక్ సంస్థ ద్వారా నియమితులైన ఇంజినీర్ల సమస్యతో ముడిపెట్టి అడ్డంకి సృష్టించిందన్న విమర్శలొస్తున్నాయి. ఖజానాలో నిధుల్లేకనే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో జీతాలు, పింఛన్లు నెలాఖరు వరకు విడుదల కావట్లేదని, గుత్తేదారుల బకాయిలు రూ. వందల కోట్ల మేర పేరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పీఆర్సీ పరిస్థితి ఇదీ..
ఉద్యోగుల జీతాల పెరుగుదలకు సంబంధించిన పీఆర్సీ ఉత్తర్వును జీహెచ్ఎంసీ అమలు చేయలేకపోతోంది. నిధుల కొరతతో ఆర్థిక విభాగం ఏజీఐ(యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్), ఏఏఎస్(ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్) నిబంధనను అసందర్భంగా తెరపైకి తెచ్చిందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రకరకాల కారణాలతో చాలా మంది ఉద్యోగుల ఇంక్రిమెంట్లు నిలిచిపోయి ఉంటాయి. ఇతరత్రా సర్వీసు సమస్యలూ ఉంటాయి. వాటన్నింటినీ పరిష్కరించేందుకు అకౌంట్స్ విభాగంలో ఇప్పుడున్న సిబ్బంది సరిపోరు. ఇలాంటి పరిస్థితిలో 15 రోజుల్లో వాటన్నింటినీ పరిష్కరించి ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేసి బిల్లులు పెట్టాలని కేంద్ర కార్యాలయం షరతు విధించింది. ఫలితంగా 50 శాతానికిపైగా ఉద్యోగుల జీతాలు బిల్లులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ‘పెరిగిన జీతంతో ఖజానాపై పడే భారాన్ని తప్పించుకునేందుకు ఆర్థిక విభాగం ఇలాంటి అంతర్గత ఉత్తర్వును విడుదల చేసింది’ అని జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు సేవల కింద పని చేస్తోన్న వేలాది మంది చిరుద్యోగులకు పీఆర్సీ ఇవ్వడంపైనా సమస్యలు సృష్టిస్తుండటం అందుకు నిదర్శనమని అన్నారు.