ఊరు నిద్దరోయింది.. వాయువు నిద్రలేచింది.
ఎప్పటిలాగే ఆ గ్రామం రాత్రి నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో 40 రోజులు మూత పడిన ఆ రసాయన కర్మాగారం నిద్ర లేచింది. పునరుద్ధరణ కోసం చేపట్టిన పనులు ఆ ఊరి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చాయి. పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, పశువులు, పక్ష్యాదులు, చెట్టు చేమ అనే తేడా లేకుండా విషవాయువు కమ్మేసింది. కట్టేసిన మూగజీవాలు అలాగే జీవం కోల్పో యాయి. ప్రాణ వాయువు అందించే మొక్కలు విషవాయువు చేతచిక్కి మాడి మసయ్యాయి.
నిద్రలో నుంచి లేచిన కొందరు గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ఊరి బావిలో, మురుగు కాల్వలో పడిపోయారు. అక్కడే ముగ్గురు తుది శ్వాస విడిచారు. పదుల సంఖ్యలో ప్రజల వీధుల్లో పడిపోయారు. స్పృహ కోల్పోయారు. నిద్ర మత్తులో ఉన్నవారు రసాయన గాలి ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గురువారం సాయంత్రానికి 11ప్రాణాలు గాలిలో కలిశాయి. పదుల సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయి. వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు.
తెల్లవారుజామునే..
తెల్లవారుజామున 2:30గంటలకు మొదలైంది...ఈ విషాదం. విశాఖలోని గోపాలపట్నం సమీపంలోని వేపగుంట వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో మొదలైన గ్యాస్ లీకేజీ నల్లమబ్బులా ఆ ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. అర్థరాత్రి సమయంలో కావడం వల్ల గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తేరుకునే సరికే తీరని నష్టం జరిగింది. వేసవి కావటం వల్ల కిటికీలవి తెరిచి ఉంచారు. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి లీకైన గ్యాస్ గాల్లో కలసిపోయి...అలా అందరి ఇళ్లలోకి చేరిపోయింది. శరవేగంగా వ్యాపించి ఆ ప్లాంట్ సమీపంలోని 3 గ్రామాలపై పెను ప్రభావం చూపింది. ఊపిరి ఆడలేదు, ఒళ్లంతా మంటలు, కళ్ల నీళ్లు... బయటకు వద్దామన్నా పొగమంచులా కమ్మేసిన రసాయన ప్రభావంతో ఎదురుగా ఏం ఉందో కనిపించని దుస్థితి. ఇద్దరు బాధితులు అలాగే పరుగులు తీసి గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోవటం అందరి మనసులనూ కలచివేసింది.
ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చే క్రమంలో కొందరు పోలీసులపైనా విష వాయువు ప్రభావం పడింది. పరిస్థితి తీవ్రతరమవటం వల్ల బాధితులను ఆటోలు, బైక్లపైనా తరలించాల్సి వచ్చింది. ప్రభుత్వ వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. స్పృహ కోల్పోయి రోడ్లపైనే చాలా మంది పడిపోవటం విష వాయువు తీవ్రతకు అద్దం పట్టింది. ఈ కలకలంలో వృద్ధులు, చిన్నారులు మరింత తీవ్రస్థాయిలో ఇబ్బంది పడ్డారు. కొంతమంది మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. 200 మంది తీవ్ర అస్వస్థతకు గురై విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.