తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్తు దందాకు అడ్డాగా హైదరాబాద్‌ - గంజాయి గ్యాంగ్​ను పట్టుకునేందుకు పోలీసుల నయా ప్లాన్

Ganja Gangs in Hyderabad : పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి మహమ్మారి రాష్ట్రంలోకి రవాణా అవుతోంది. ఓ వైపు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు హైదరాబాద్‌ శివారు ప్రాంతాలతో పాటు సరిహద్దు జిల్లాలను అడ్డాగా చేసుకుని మత్తు పదార్ధాలను నగరంలోకి తరలిస్తున్నారు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ అటవీ ప్రాంతం స్మగ్లింగ్‌ ముఠాలకు కేంద్రంగా మారుతోంది. ఒడిశా నుంచి గంజాయి, బెంగళూరు గుండా హెరాయిన్‌, కొకైన్‌ గుల్బర్గా కేంద్రంగా నిద్రమాత్రలు రవాణా అవుతున్నట్లు పలు సందర్భాల్లో బయటపడింది.

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 10:35 AM IST

Ganja Gangs in Hyderabad City Outskirts
Ganja Gangs in Hyderabad

మత్తు దందాకు అడ్డాగా హైదరాబాద్‌ - గంజాయి గ్యాంగ్​ కోసం రూట్ మార్చిన పోలీసులు

Ganja Gangs in Hyderabad: రాష్ట్రంలో గంజాయి వ్యసనపరులు పెరుగుతున్నారని ఇటీవల కేంద్రం వెల్లడించిన గణాంకాలతో ఏ స్థాయిలో గంజాయి, మత్తు పదార్ధాలు రాష్ట్రంలోకి వచ్చి చేరుతున్నాయో అర్థమవుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను అక్రమార్కులు అడ్డాగా మార్చుకుని మత్తు దందాను సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, భద్రాద్రి కొత్తగూడెం అటవీప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. గతంలో కేవలం కూలీలు, జేబు దొంగలకే పరిమితమైన గంజాయి ఇప్పుడు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి చెంతకు చేరుతోంది.

Ganja Supply in Hyderabad City Suburbs: ఒకప్పుడు గుడుంబాకు కేంద్రంగా ఉన్న ధూల్‌పేట్, మంగళ్‌హాట్‌ ప్రాంతాలు ఇప్పుడు గంజాయికి ప్రధాన కేంద్రంగా మారాయి. ఇక్కడ పోలీసుల తనిఖీలకు భయపడి నానక్‌రామ్‌గూడ, పుప్పాలగూడ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మేడ్చల్ ప్రాంతాలను మత్తు ముఠాలు స్థావరాలుగా మార్చుకున్నాయి.

కిరాణ దుకాణాలతో పాటు పాల షాపుల ముసుగులో యువతకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. టీఎస్ న్యాబ్ పోలీసులు ఇటీవల నానక్‌రామ్‌గూడలోని ఓ కిరాణ దుకాణంపై దాడి చేసి భారీ ఎత్తున గంజాయి, కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్క దుకాణం నుంచే సుమారు రెండు వేల మంది గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీలు, అరెస్టులతో స్మగర్లు కొత్త పంథాల్లో మత్తు పదార్ధాలను గమ్యానికి తరలిస్తున్నారు.

సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత

Supplying Ganja From Other States : మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీల్లో గంజాయికి విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో మత్తుపదార్థాల రవాణాలో అనుభవం కలిగిన, జైలుకెళ్లొచ్చిన పాత నేరస్థులతో అంతరాష్ట్ర ముఠాలు చేతులు కలుపుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి సరుకు హైదరాబాద్ దాటిస్తే లారీ, డీసీఎం, కార్లకు రోజుకు 50 వేల నుంచి 60 వేలు కిరాయి, డ్రైవర్‌కు 20 వేలు, ఏజెంట్లకు 30 వేలు ఇస్తామని మత్తు ముఠాలు ఆశచూపుతున్నాయి. అక్కడ కిలో గంజాయి పది వేల నుంచి 15 వేలకు కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కిలో 50 నుంచి 60 వేలకు విక్రయిస్తున్నారు.

5, 10 గ్రాముల గంజాయి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. 2021లో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో పోలీసులు 6,362 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 2022లో 9,703 కిలోలు పట్టుకున్నారు. ఈ ఏడాది 15 వేల కిలోలు స్వాధీనం చేసుకుని ఉంటారని అంచనా. పోలీసుల దాడులు, తనిఖీల్లో పట్టుబడేది కేవలం 20 నుంచి 30శాతం మాత్రమేనని పెద్దఎత్తున గంజాయి ఇతర రాష్ట్రాలకు చేరుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

బోల్తా కొట్టిన కారు - బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి, ఎక్కడంటే?

Ganja Addiction Increased in Telangana: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావటంతో స్మగర్లు జహీరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని రౌడీషీటర్లు, పాతనేరస్థుల సివిల్ పంచాయతీలకు స్థిరాస్తి వ్యాపారుల ప్రైవేట్‌ పార్టీలు, దందాలకు జహీరాబాద్‌ కేంద్రంగా మారింది. ఏపీ, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చే సరుకును అక్కడ డంప్ చేస్తున్నట్లు సమాచారం.

అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రైవేటు బస్సులు, వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అయితే జహీరాబాద్ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టేందుకు పోలీసులు సిద్ధమై చివరి నిమిషంలో ఆగిపోయినట్టు తెలుస్తోంది. మాదకద్రవ్యాలతో పాటు గంజాయి వంటి మత్తు పదార్ధాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఈ చర్యల వల్ల పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

గంజాయి రవాణా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఉత్తర్‌ప్రదేశ్‌ వయా హైదరాబాద్​ - అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

రూ.1.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం - ఎక్కడంటే?

ABOUT THE AUTHOR

...view details