సాధారణంగా గాంధీకి చాలామంది విషమ పరిస్థితుల్లోనే వస్తుంటారు. వీరిలో 60 శాతం మందికి సీ-పాప్, వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. గాంధీ ఆసుపత్రి విజయం వెనుక వెద్యుల పట్టుదలతోపాటు ఆ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ పి.ప్రభాకరరెడ్డి కృషి ఎంతో ఉంది. పీపీఈ కిట్ కూడా లేకుండానే కొవిడ్ వార్డుల్లో పర్యటించి సమన్వయం చేస్తుంటారు. దీంతో రెండేళ్లుగా ఆయన కుటుంబంతో కలవవకుండా విడిగా ఉంటున్నారు. ‘ఈటీవీ భారత్’ ముఖాముఖిలో గాంధీ అందిస్తున్న సేవల గురించి డాక్టర్ ప్రభాకరరెడ్డి వివరించారు.
గాంధీ ఆసుపత్రి ఎంతమంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడగలిగింది ?
మొదటిదశలో 35,541 మంది, రెండోదశలో ఇప్పటివరకు 8,794 మంది ప్రాణాలను నిలిపాం. రోజూ కనీసం వందమంది కరోనాను జయించి ఇళ్లకు చేరడం మాకు సంతృప్తినిస్తోంది. రెండేళ్లుగా ప్రతి షిప్ట్లో 200 మంది తగ్గకుండా వైద్యులు, అవసరమైన నర్సింగ్ ఇతర సిబ్బంది కృషి వల్లే వేలాదిమంది రోగులు కోలుకోగలిగారు.
మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉందన్న విమర్శలు ఉన్నాయి కదా..?
గాంధీకి మూడొంతుల మంది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వస్తుంటారు. అక్కడ పది పన్నెండు రోజులు ఉంచి చికిత్స కష్టమనుకుంటే గాంధీకి పంపిస్తుంటారు. వారిలో ఎక్కువమంది ఊపిరితిత్తులు 80 శాతం పని చేయకుండానో.. గుండె, ఇతర అవయాలు బాగా దెబ్బతిన్నాకనో వస్తుంటారు. వెంటిలేటర్ మీద ఉంచి మందుల సాయంతో చాలామంది ప్రాణాలు నిలిపాం. మరీ వైద్యానికి స్పందించని వారు చనిపోతుంటారు. కోలుకుంటున్నవారితో పోలిస్తే చనిపోయిన వారి శాతం చాలా తక్కువ.
వచ్చిన రోగులందరికీ పడకలు కేటాయించగలుగుతున్నారా?
ప్రస్తుతం 650 వెంటిలేటర్, 650 ఆక్సిజన్ పడకలు, మరో 600 సాధారణ పడకలు ఉన్నాయి. ఇటీవల గాంధీ పూర్వ విద్యార్థులు 150 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళం ఇచ్చారు. వాటివల్ల మరో 300 ఆక్సిజన్ పడకలు సిద్ధమయ్యాయి. లైబ్రరీ భవనంలో 200 పడకలను ఏర్పాటు చేసి ఆక్సిజన్ పడకలుగా మార్చబోతున్నాం. ప్రస్తుతం రోజూ 30 మందికి వెంటిలేటర్ అవసరం వస్తోంది. దీంతో ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్నవారిలో మెరుగుపడిన వారిని ఆక్సిజన్ పడక మీదకు మార్చి.. వెంటిలేటర్ అవసరమైన వారిని అక్కడికి షిప్ట్ చేస్తున్నాం. వారంరోజులుగా కొత్త రోగులకు కొంత సులభంగానే పడకలు ఇవ్వగలుగుతున్నాం.
మొదటి దశకు ఇప్పటికి వైరస్లో ఎటువంటి తేడా గమనించారు?
అప్పుడు కాస్త పెద్ద వయసువారు, ఇతరత్రా రోగాలు తీవ్రంగా ఉన్న వారిపైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపించేది. మూడువారాల్లో కోలుకునే వారు. ఈసారి వయసుతో సంబంధం లేకుండా అందరిపైనా ప్రభావం చూపిస్తోంది. యువతలో కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి చనిపోతున్నారు.