సమాజంలో గత రెండు నెలలుగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. ‘సాధారణ మరణం అంటున్నారు కానీ కరోనాతోనే చనిపోయి ఉండొచ్చు, పోనీ మరణించిన వ్యక్తికి పాజిటివ్ లేకపోయినా అంతిమ యాత్రకు వచ్చే వారి నుంచి కొవిడ్ సోకే ప్రమాదం ఉంది’ అని అత్యంత సన్నిహితులు, సమీప బంధువులు ఎవరూ వెళ్లడం లేదు. చివరి చూపునకు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్న సొంత కుటుంబ సభ్యులు కూడా కదలడం లేదు. దీంతో అంతిమ సంస్కారాలనే కొందరు వ్యాపార అవకాశంగా మలచుకున్నారు. పలు ప్రాంతాల్లో అంబులెన్సుల వారు, అంతిమయాత్ర వాహనాల యజమానులు ప్యాకేజీలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు.
‘‘కరోనాతో చనిపోయినా ఏం పర్లేదు, మేమే తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేసి అస్థికలు తెచ్చిస్తాం. రేటు ఎక్కువ అవుతుంది’’ అని చెబుతున్నారు. శ్మశానాల దూరాన్ని బట్టి రూ.20 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నారు. దగ్గరివారు రానందున ఏదో విధంగా ఈ కార్యక్రమం పూర్తయితే చాలు అన్నట్లు ప్యాకేజీ మాట్లాడుకుని తమ బంధువు దహన కార్యక్రమాలు పూర్తి చేసినట్లు శ్రీధర్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి 'ఈటీవీ భారత్' వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. సహజ మరణం పొందినా రావడానికి అతి దగ్గరి బంధువులూ భయపడుతున్నారని ఆయన వివరించారు. కనీసం ఒకరిద్దరు కూడా రావట్లేదని తామే పూర్తి చేస్తున్నామని హైదరాబాద్లోని ఓ అంబులెన్స్ డ్రైవర్ 'ఈటీవీ భారత్'కు చెప్పారు.
అంబులెన్స్ యజమాని నుంచి కాటికాపరి దాకా...
కొవిడ్ అంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మృతదేహాన్ని తరలించే అంబులెన్స్ యజమాని మొదలుకొని దహన ఏర్పాట్లు చేసే కాటికాపరి దాకా అందరూ రూ.వేలల్లో అడుగుతున్నారు. ఆసుపత్రిలో రూ.లక్షల ఫీజు కట్టినా దహనానికి మరో రూ.లక్ష ఖర్చయిందని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి వాపోయారు. కరోనా లేనప్పుడు అయిన మొత్తంతో పోలిస్తే ఏడాది వ్యవధిలోనే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ పెరిగిందని హైదరాబాద్లో ఓ కాటికాపరి చెప్పారు. కొందరు పేదలు ఈ ఖర్చులు భరించలేక శవాలను మున్సిపాలిటీ లేదా పంచాయతీల సిబ్బందికి అప్పగించేస్తున్నారు.
సాధారణంగా చనిపోయినా...
గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి సమీపంలో ఓ వృద్ధుడు ఇంట్లోనే సాధారణ మరణం చెందారు. ఇంటి పక్కనే ఉన్న అతి దగ్గరి బంధువులు కూడా రాలేదు. హైదరాబాద్లో ఉండే కూతుళ్లూ వెళ్లలేదు. చివరికి ఆ ఇంటి వారు రూ.30 వేలకు ప్యాకేజీ మాట్లాడారు. మృతదేహాన్ని తెనాలి శ్మశానానికి తీసుకెళ్లి ఆ ప్యాకేజీ సంస్థ వారే దహనం చేశారు. వారే అస్థికలు అప్పగించి వెళ్లారు. సాధారణ పరిస్థితుల్లో అయితే అదే పల్లెటూరిలో శవ దహనానికి రూ.10 వేలు కూడా ఖర్చు కాదు. కొవిడ్ భయంతో మరో రెండు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు.