తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబజార్లకు మహర్దశ

రాష్ట్రంలో రైతుబజార్లకు మహర్దశ పట్టనుంది. రైతులు.. ప్రజల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో రైతు బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం మార్కెటింగ్‌ శాఖ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.

By

Published : Mar 13, 2020, 6:17 AM IST

Updated : Mar 13, 2020, 8:38 AM IST

raithu bazars
రైతుబజార్లకు మహర్దశ

రాష్ట్రంలో రైతుబజార్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులు.. ప్రజల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, భువనగిరి, సిరిసిల్ల రైతుబజార్లను నవీకరించేందుకు మార్కెటింగ్‌ శాఖ రూ. 20.63 కోట్లు కేటాయించింది. ఐటీ పరిశ్రమలకు దగ్గరగా ఉన్నందున కూకట్‌పల్లి రైతుబజారుకు నూతన హంగులు అద్దెందుకు ఏకంగా రూ. 18.53 కోట్లు ఇచ్చింది. వీటన్నింటికి మహర్దశ పట్టనుంది.

కొన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అందుబాటులో భూమి లేకపోవడం వల్ల వీటి ఏర్పాటులో జాప్యం నెలకొంటోంది. ప్రస్తుతం కొత్తగా 16 రైతుబజార్ల ఏర్పాటుకు రూ. 18.88 కోట్లను మార్కెటింగ్‌ శాఖ మంజూరు చేసింది. కొన్నిచోట్ల పట్టణాల్లో జనావాసాల మధ్య స్థలాలున్నా.. వాటిపై ప్రైవేటు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు.

రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 రైతుబజార్లు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 రైతుబజార్లు ఉండేవి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మరో 30 మంజూరు చేసింది. వీటిలో 16 రైతు బజార్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతమున్న 44లో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసింది మాత్రమే అక్కడి పురపాలక సంఘం పరిధిలో ఉంది. మిగతావన్ని స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీలే నిర్వహిస్తున్నాయి. కొత్త వాటి నిర్మాణం పూర్తయితే.. ఒక్కోదాని పరిధిలో అదనంగా అయిదారు గ్రామాల రైతులు కూరగాయలు తెచ్చి అమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల అదనంగా 150 గ్రామాల్లో కూరగాయల పంటల సాగు, దిగుబడులు పెంచడానికి అవకాశం ఏర్పడుతుందని మార్కెటింగ్‌ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

పాత రైతు బజార్లలో సమస్యలు

కొన్ని పట్టణాల్లోని పాత రైతుబజార్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కూరగాయలు అమ్మేందుకు స్టాళ్లు నిర్మించినా.. వాటిలో కాకుండా, రోడ్లపై అపరిశుభ్ర వాతావరణంలో అమ్ముతుండటంతో వినియోగదారులతో పాటు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనీస సౌకర్యాల లేమి..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 11 పురపాలక సంఘాలు ఉండగా, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, భైంసా పట్టణాల్లో రైతుబజార్లు నిర్మించారు. వాటిలో కనీస సౌకర్యాలు లేకపోవడం, వినియోగదారులు లోపలికి రావడం లేదనే కారణంతో రైతులు, వ్యాపారులు రోడ్లపైనే అమ్మేందుకు కూర్చుంటున్నారు. మిగిలిన సంఘాల్లో ప్రత్యేక స్థలాల్లో డేరాలు వేసుకొని విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్‌ రైతుబజార్‌లో భాగంగా నిర్మించిన స్టాల్స్‌లో కాకుండా ఆరుబయట, శివాజీచౌక్‌లో బురద రోడ్లపై బేరసారాలు జరుగుతున్నాయి.

నిర్మల్, మంచిర్యాలలో..

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గాంధీ పార్కు స్థలంలోనే రైతుబజార్‌ను ఏర్పాటు చేసి షెడ్లు నిర్మించినా వృథాగా ఉన్నాయి. రైతులు రోడ్ల పక్కనే కూరగాయలు అమ్ముతున్నారు. ఫలితంగా ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. మాంసం అమ్మకాలకు ప్రత్యేకంగా మార్కెట్లు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ విక్రయిస్తున్నారు. మంచిర్యాలలో కూరగాయల విక్రయానికి రైతుబజార్‌ను నిర్మించారు. కానీ వ్యాపారులు వాటిని వదిలేసి రోడ్డు పక్కనే అమ్ముతున్నారు.

ఇదీ చూడండి:తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్​ రెడ్డి

Last Updated : Mar 13, 2020, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details