ప్రాణికోటికి జీవనాధారామైన జలం వృథా కాకుండా కాపాడాలనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. వర్షపు నీటిని సాగుకు వినియోగించి వదిలేసిన నీటిని నిల్వ చేసేందుకు... రాష్ట్రంలోని ఉపనదులు, వాగులపై చెక్డ్యాంలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం 1,235 చెక్డ్యాంలను నిర్మించాలని... ఈ ఏడాది 610 నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పంతో... ఇప్పటికే టెండరు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది బడ్జెట్లో మొదటి ప్రాధాన్య అంశంగా వీటికే నిధులు కేటాయించనున్నారు.
'చెక్డ్యాంలకు బడ్జెట్లో నిధులు' - Water Projects Check Dams
తెలంగాణలో బొట్టు బొట్టు నీటిని ఒడిసి పట్టుకోవాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. దానికోసం రాష్ట్రంలోని ఉపనదులు, వాగులపై చెక్డ్యాంలను నిర్మించి నీటిని నిల్వ చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ ఏడాది బడ్జెట్లో మొదటి ప్రాధాన్య అంశంగా వీటికే నిధులు కేటాయించనున్నారు.

మొదటి దశలో నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిన చెక్డ్యాంలలో ఇప్పటి వరకు గోదావరి పరీవాహకంలో 120, కృష్ణా పరీవాహకంలో 30 నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించారు. వీటిలో 23 పనులకు ఒప్పందం పూర్తి చేశారు. సిద్దిపేట, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో రెండేసి, తాండూరులో మూడు, ఆదిలాబాద్లో మూడు, బోథ్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కొన్నింటికి గుత్తేదారులతో ఒప్పందం పూర్తి చేశారు. నిధుల విడుదలపైనే టెండర్ల అంశం ఆధారపడి ఉన్నట్లు కొందరు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు కాలువలకు తూముల నిర్మాణాలు చేపట్టగా ఆ నిధులు ఇప్పటికీ అందలేదని దీనివల్లే చెక్డ్యాంలకు టెండర్లు వేయడానికి వెనక్కుతగ్గుతున్నట్లు కొందరు గుత్తేదారులు పేర్కొంటున్నారు. బిల్లుల చెల్లింపు అంతా ఆన్లైన్లోనే నిర్వహిస్తుండటంతో పనులు పూర్తికాగానే నేరుగా గుత్తేదారు బ్యాంకు ఖాతాలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు.
- నిర్మించనున్న మొత్తం చెక్డ్యాంలు : 1,235
- నిధుల అంచనా : రూ.4,900 కోట్లు
- ఈ ఏడాది చేపట్టనున్నవి : 610
- నిధుల అంచనా వ్యయం : రూ.2,560 కోట్లు
- ఇప్పటికి పరిపాలన అనుమతులు వచ్చినవి : 238
- అంచనా వ్యయం: రూ.1,255 కోట్లు
- టెండర్లు నిర్వహించినవి: 150
- పనులు చేపట్టినవి: 23
ఇదీ చూడండి :డీసీసీబీ, డీసీఎమ్మెస్ డైరెక్టర్ పదవులపై సీఎం కసరత్తు