తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకాశంలో పెట్రో ధరలు... అవస్థల్లో ప్రజలు

ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఫలితంగా నిత్యావసర సరకుల పైనా ఈ ప్రభావం పడింది. వివిధ జిల్లాల నుంచి నగరానికి కూరగాయలు తరలించడానికి వాహనదారులకు రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఫలితంగా కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

By

Published : Feb 15, 2021, 1:30 PM IST

rates increasing of fuel
కూరగాయలపై ఇంధన ధరల ప్రభావం

ఇంధన ధరలు శరవేగంగా పెరిగిపోతున్నాయి.. మన ఇంట వెచ్చించే కూరగాయలపైనా ఇది ప్రభావం చూపిస్తోంది.. పెట్రోల్, డీజిల్‌ ధరల హెచ్చుతో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు రవాణా ఛార్జీలు తడిసి మోపెడవడమే ఇందుకు కారణం.
ఏటా డిసెంబరు నుంచి మార్చి వరకు నగరానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. మిగిలిన సమయాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి దిగుమతి అవుతాయి. ప్రస్తుత సీజన్‌లో మాత్రం తెలంగాణలోని వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, వరంగల్‌ జిల్లాల నుంచి వస్తున్నాయి. గతేడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు మన రాష్ట్రంలో కూరగాయల పంటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. బెండ, బీన్స్, బీర, బీట్‌రూట్‌ సహా అనేకం దూర ప్రాంతాల నుంచి వస్తుండటం.. ఇంధనం ధరల పెరుగుదలతో రవాణా ఖర్చు ఎక్కువైంది. ‘‘సాధాణంగా ప్రస్తుత సీజన్‌లో కూరగాయల ధరలు తక్కువగానే ఉంటాయి. ఈసారి ఆశించిన స్థాయిలో తగ్గలేదు. గతనెలతో పోల్చితే తగ్గినా.. అదీ స్వల్పమే. పంటల దిగుబడి కూడా తగ్గిందని రైతులు చెబుతున్నారు. రవాణా ఖర్చులూ పెరిగాయి.’’ అని మార్కెటింగ్‌ శాఖాధికారి ఒకరు విశ్లేషించారు.

పెరుగుతున్న ఇంధన ధరలు.

రవాణా రంగంపై ప్రభావం

మొన్నటి డిసెంబరుతో పోల్చితే లీటరు పెట్రోల్‌పై రూ.5.51, డీజిల్‌ రూ.5.57 పెరిగాయి. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపుతోంది. కూరగాయలు, నిత్యావసర సరకుల రవాణాకు వాహనదారులు ఛార్జీలు పెంచారు. శివారు జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉత్పత్తుల విషయంలో ఈ ధరలు పెరుగుతున్నాయి.
ఎక్కడెక్కడి నుంచి ఏ సరకు వస్తుంది..
* మేడ్చల్, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, వరంగల్, జిన్నారం, గుల్బర్గా, బీదర్, నాందేడ్‌ నుంచి బోయిన్‌పల్లి మార్కెట్‌కు టమాటా వస్తాయి.
* చేవెళ్ల, వికారాబాద్, షాబాద్, నాచారం, చిక్‌బళ్లాపూర్, కోలార్‌ ప్రాంతాల ద్వారా -క్యారెట్‌.
* జహీరాబాద్, సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్, వికారాబాద్, ములుగు, మేడ్చల్, శామీర్‌పేట నుంచి ఆలుగడ్డ తెస్తారు.
* సంగ్లి, సోలాపూర్, నాందేడ్, ముంబయి, జహీరాబాద్, శామీర్‌పేట, మేడ్చల్, గుల్బర్గా- క్యాప్సికం.
* సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్, దౌల్తాబాద్, యాదాద్రి, అనంతపూర్, అద్దంకి, గుంటూరు, కర్నూల్, గుత్తి నుంచి బెండ.
* మేడ్చల్, జహీరాబాద్, నాచారం, అహ్మద్‌నగర్, సోలాపూర్‌ -ఉల్లిపాయలు
* సిద్దిపేట, వరంగల్, మూసాపేట, ఏటూరునాగారం, ఒంగోలు, అనంతపూర్, మార్టూరు, గుంటూరు, గుత్తి, మైదుకూరు నుంచి మిర్చి.

టమాటా, ఉల్లిపై ఇంధన ధరల ప్రభావం

జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి


గతంలో ఇంధన ధరలు తగ్గినప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూ.4 సెస్‌ విధించింది. ధరలు పెరిగినందున ఆ సెస్‌ తొలగించాలి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. 70 శాతం పన్నులు విధించి వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు. చమురు ధరలతో రవాణా రంగం నష్టపోతోంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.

- నందారెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షులు

రెండు నెలల వ్యవధిలో కూరగాయల ధరల్లో వ్యత్యాసం
బోయిన్​పల్లి మార్కెట్​లో మూడు నెలల్లో చేరిన కూరగాయల పట్టిక

ఇదీ చదవండి:నూతన సాగు చట్టాలతో రైతులకు స్వేచ్ఛ: కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details