తెలంగాణ

telangana

ETV Bharat / state

మహా నగరంలో ఇంటింటా.. జలగంట - water for free to every household in Hyderabad

మహా నగరంలో లక్షలాది కుటుంబాలకు ఇది తీపికబురు. 9.80 లక్షల ఇళ్లకు ఈనెల నుంచే 20వేల లీటర్ల చొప్పున తాగునీటిని ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దానికి సంబంధించిన బిల్లులను వసూలు చేయకూడదని జలమండలి నిర్ణయించింది. తద్వారా నగర ప్రజలపై నెలకు రూ.40-50 కోట్ల వరకు భారం తగ్గనుంది.. గత నెల సరఫరా(337 ఎంజీడీలు) కంటే అదనంగా మరో 85 ఎంజీడీలు పెంచి సరఫరా చేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

hyderabad
మహా నగరంలో ఇంటింటా.. జలగంట

By

Published : Dec 18, 2020, 8:19 AM IST

ల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజధానిలో ప్రతి ఇంటికి డిసెంబరు నుంచే నెలకు 20 వేల లీటర్ల చొప్పున నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సర్కారు నుంచి మార్గదర్శకాలు జారీ కాకపోయినా సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 5 నుంచే నగరంలో నిత్యం 85 ఎంజీడీ(రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) వరకు సరఫరాను జలమండలి పెంచింది. తద్వారా ప్రతి ఇంటి యజమాని సద్వినియోగం చేసుకునేలా అవకాశాన్ని కల్పించారు. అదనంగా ఇస్తున్న నీటిని సింగూరు, మంజీరా నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలో రోజు విడిచి రోజు సరఫరా ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంట, ఎత్తైన ప్రాంతాల్లో రెండు గంటలు ఇస్తున్నారు. పైపులైను వ్యవస్థ బాగున్నచోట నిత్యం కొంతసేపు ఇస్తున్నారు. నీటి కనెక్షన్‌ పరిమాణాన్ని పెంచుకోకపోతే ఇంటికి 20 వేల లీటర్ల నీటిని తీసుకోవడం కష్టమని చెబుతున్నారు. ఉదా: 15 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్లకు చాలా వరకు 25 ఎంఎం డయా సామర్థ్యం గల నీటి కనెక్షన్లు ఉన్నాయి. 40 ఎంఎంకు పెంచుకుంటేనే ప్రతి ఫ్లాట్‌కు ఉచిత నీటిని తీసుకోవడానికి వీలుపడుతుందని తెలిపారు.

ఇదీ పరిస్థితి

  • నగరంలో మొత్తం నీటి కనెక్షన్లు - 10.28 లక్షలు
  • వీటిలో గృహ వినియోగదారులవి - 9.80 లక్షలు
  • గత నెల వరకు వీటన్నింటికి సరఫరా చేసిన నీరు - 337 ఎంజీడీలు
  • అన్నివిధాలా ప్రస్తుతం రోజూ సరఫరా చేస్తున్న నీరు - 422 ఎంజీడీలు
  • గృహాలకు 20వేల లీటర్ల చొప్పున ఉచితంగా ఇచ్చేందుకు అదనంగా అవసరం - 85ఎంజీడీలు

బస్తీల్లో మీటర్ల ఏర్పాటు

గరంలో 9.28 లక్షల గృహ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఆరు లక్షలమంది మాత్రమే మీటర్లు పెట్టుకున్నారు. ఇందులో పూర్తిస్థాయిలో పని చేసేవి 2.50 లక్షల మీటర్లు మాత్రమే. కొత్త పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే ప్రతి ఇంటికి ఇవి అవసరం. అప్పుడే ఒక్కో ఇంటికి ఎన్ని లీటర్లు సరఫరా చేస్తున్నామన్న విషయం తెలుస్తుంది. మీటరు ఖరీదు రూ. 2వేలు ఆపైన ధర మాత్రమే ఉన్నా ఏర్పాటుకు చాలామంది ముందుకు రావడం లేదు. సర్కార్‌ విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే గానీ వీటిని నిర్భందంగా జలమండలి ఏర్పాటు చేయలేదు. ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 500 మందికి నీటిని సరఫరా చేసే మెయిన్‌ పైపులైను దగ్గర పెద్ద మీటర్లను 100 బస్తీల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి బస్తీలోనూ 15-20 ఇళ్లకు జలమండలి అధికారులే మీటర్లను పెడతారు. దీనివల్ల ఒక్కో బస్తీలో 500 మందికి ఎంత నీరు సరఫరా అయిందన్న విషయం తెలుస్తుంది. కాగా ఎక్కడైనా 20వేల లీటర్లకు మించి వినియోగముంటే ఆ మేరకు బిల్లు పడే అవకాశముంది.

మురుగుకు బిల్లులేదు

  • ప్రస్తుతం ప్రతి ఇంటి నుంచి వసూలు చేసే తాగునీటి బిల్లులో 35 శాతం మురుగునీటి బిల్లుగా జలమండలి చూపిస్తోంది. సర్కార్‌ నిర్ణయం మేరకు దీనికి కూడా ఎటువంటి బిల్లు వసూలు చేయకూడదని జలమండలి భావిస్తోంది. తమకు వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
  • ఉచిత నీటి సరఫరా వల్ల జలమండలిపై ఏడాదికి రూ.150 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేశారు. దీనిని ప్రభుత్వమే భరించనుంది.
  • పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న 117 సెక్షన్లను 150కు పెంచాలని నిర్ణయించారు. ఒక్కో సెక్షన్‌లో ఒక్కో సహాయ ఇంజనీరు పర్యవేక్షిస్తారు.

ఇవీ చూడండి:'రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు'

ABOUT THE AUTHOR

...view details