హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరంలో రయ్ రయ్ అంటూ రేసింగ్ కార్ల శబ్దాలు సందడి చేశాయి. మధ్యహ్నం రెండు గంటల నుంచే పోటీలో ఉన్న ఆరు జట్ల రేసర్లు ట్రాక్పై చక్కర్లు కొట్టారు. రేస్ను చూసేందుకు ప్రేక్షకులు ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకుని రాగా.. ట్రాక్ చూట్టూ సాధారణ ప్రజలు అధిక సంఖ్యలో రేసింగ్ను వీక్షించారు. నేడు క్వాలిఫైయింగ్ 1, 2 లను ప్రధాన రేస్లను నిర్వహించాల్సి ఉండగా.. ట్రాక్ పై అవగాహన దృష్ట్యా ట్రయల్స్ మాత్రమే నిర్వహించారు.
రేపు వీటితో పాటు రేస్2, రేస్ 3 జరగనున్నాయి. ఈ రేసింగ్లో 12 కార్లు, 6 బృందాలు, నలుగురు డ్రైవర్లు, మహిళా రేసర్లు పాల్గొన్నారు. 50శాతం దేశంలోని రేసర్లు, మరో 50శాతం విదేశీ రేసర్లు ఇండియన్ రేసింగ్ లీగ్లో పాల్గొన్నారు. పెట్రోల్ కార్లు 240కి.మీ స్పీడ్తో వెళ్లాయని, ఎలక్ట్రిక్ కార్లయితే గరిష్ఠ వేగం 320 కి.మీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ రేసులో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గోవా, దిల్లీ, కొచ్చి బృందాలు పాల్గొన్నాయి. ఈ రేసింగ్లో మొత్తం 18 మూలమలుపులు ఉన్నాయి. ప్రతి మూలమలుపు వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందించడానికి, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా అంబులెన్స్ను కూడా సిద్ధంగా ఉంచారు.
పది గంటలకే ఈవెంట్ మొదలవుతుంది: ఇండియన్ రేసింగ్ లీగ్ మొత్తం రేపే నిర్వహిస్తామని.. క్వాలిఫయింగ్ రేస్ కూడా రేపే ఉంటుందని ఆర్ఆర్పీఎల్ డైరెక్టర్ అఖిలేశ్ తెలిపారు. ప్రేక్షకులు రేపు ఉదయం 8 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. పది గంటలకే ఈవెంట్ మొదలవుతుందని వెల్లడించారు. భారీ కేడ్లు సరిగా ఏర్పాటు చేయకపోవడంతో రేసు ప్రాక్టీస్ కిందే నిర్వహించామన్నారు. టికెట్స్ బుక్ చేసుకున్న వారి ఎంట్రీ ఇష్యూ అయిందని.. ఈరోజు జరిగిన చిన్న తప్పులు రేపు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు.
రేసింగ్ను పరిశీలించిన కేటీఆర్: ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహంచడం చాలా పెద్ద విషయమని.. డ్రైవర్ సేఫ్టీకి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారని రేసర్ అనిందిత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్ కాబట్టి అర్ధం చేసుకోవడానికి టైమ్ పడుతుందని చెప్పారు. ఈ ట్రాక్పై గరిష్ఠంగా గంటకు 240 కిలోమీటర్ల వేగం వరకు ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం ఐమ్యాక్స్ వద్ద రేసింగ్ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఒక ట్రయల్ రేస్ను జెండా ఊపి ప్రారంభించారు. రేసర్లతో ఆయన ముచ్చటించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతుంది: నిర్వాహకులతో మాట్లాడిన కేటీఆర్ ఏర్పాట్లపై ఆరా తీశారు. కేటీఆర్ కుమారడు హిమన్షు, కుమర్తె కూడా రేసింగ్ వీక్షించేందుకు వచ్చారు. సినీ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ కూడా ఐమ్యాక్స్ వద్ద రేసింగ్ను వీక్షించారు. ఇలాంటి ఈవెంట్ హైదరాబాద్ లో జరగటం చాలా మంచి పరిణామమని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతుందని నిఖిల్ సిద్దార్ధ్ తెలపారు.