తెలంగాణ

telangana

ETV Bharat / state

అనవసర ఖర్చు తగ్గిస్తే భవితకు భరోసా - corona effect on finance

కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. లాక్​డౌన్​ కారణంగా ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ఉత్పత్తి పడిపోయింది. రాబడి తగ్గింది. ఈ నష్టాలు దేశానికి, పరిశ్రమలకే కాదు సామాన్యులకు వర్తిస్తాయి. ఇలాంటి సమయంలో ఖర్చులు తగ్గించుకోవడమే ఉత్తమమైన మార్గం అంటున్నారు ఆర్థిక నిపుణులు.

finance planing for next one year
అనవసర ఖర్చు తగ్గిస్తే భవితకు భరోసా

By

Published : Apr 6, 2020, 4:13 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకూ పలు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పరిస్థితులు తీవ్రంగా మారుతుండటం వల్ల లాక్‌డౌన్‌ ఎన్ని రోజులు ఉంటుందో అంచనాకు అందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతో బాధ్యతగా మెలగాల్సి ఉంది. అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవాలి. లేదంటే భవిష్యత్తులో అందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అనవసర ఖర్చులు కూడా తగ్గిస్తే ఆదా అయ్యే డబ్బు రానున్న రోజుల్లో ఆదుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘ప్రత్యేక కథనం.

నీటి పొదుపు తప్పనిసరి

నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం అందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల నీటి వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. చేతులు శుభ్రం చేసుకునేందుకు, ఇళ్లను కడిగేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా నీటి వినియోగం పెరిగి కొన్ని ప్రాంతాల్లోని బోర్లలో నీటి మట్టం పడిపోతోంది. విలువైన మిషన్‌ భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడేందుకు ప్రయత్నించాలి.

నిత్యావసరాలు పదిలం

నిత్యావసర వస్తువులను ప్రజలు రెండు, మూడు నెలలకు సరిపడా కొనుగోలు చేస్తున్నారు. వస్తువుల కొరత ఏర్పడి డిమాండ్‌ పెరగడంతో ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని సొమ్ముచేసుకునేందుకు వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి కుటుంబాలకు సమస్యగా మారింది. ఎంత అవసరమో అంతే కొనుగోలు చేస్తేనే అందరూ బాగుంటారని గుర్తించాలి. ప్రభుత్వం నిత్యావసరాల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నందున అవసరం లేకున్నా కొనుగోలు చేసే పద్ధతి మానుకోవాలి.

ప్రతి పైసా జాగ్రత్త

ఖాళీగా ఉండటంతో అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి. డబ్బులు లేకపోయినా క్రెడిట్‌ కార్డులతో కొంటున్నారు. రేపు దొరుకుతాయో లేదో అన్న అనుమానంతో ప్రస్తుతం అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు బయట అప్పు పుట్టే పరిస్థితులు కూడా లేవు. భవిష్యత్తు అవసరాలు ఎలా ఉంటాయో అని చాలామంది డబ్బులు ఎవరికీ ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో అనవసర ఖర్చులు తగ్గించి వైద్యం, ఇతర అత్యవసర ఖర్చుల కోసం డబ్బులు ఆదా చేస్తే భవిష్యత్తులో అండగా ఉంటుంది.

షాక్‌ కొట్టేలా బిల్లు

అందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల గృహ విద్యుత్తు వినియోగం భారీగా పెరగనుంది. వేసవి తాపంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ, టీవీల వాడకం బాగా పెరిగింది. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లను కూడా పిల్లలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఇళ్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరైతే తప్ప పరికరాలు వినియోగించవద్ధు లేదంటే విద్యుత్తు బిల్లులు పెరిగిపోయి ఆర్ధిక భారం పెరగవచ్ఛు

అంతర్జాలం కీలకం

ప్రస్తుతం అంతర్జాల వినియోగం పెరగడంతో సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఇళ్లల్లో ఉంటున్న పిల్లలతో పాటు పెద్దలు కాలక్షేపం కోసం ఫోన్లలో మునిగి తేలుతున్నారు. ఆన్‌లైన్‌ ఆటలు, వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. ఈ క్రమంలో వర్క్‌ ఫ్రం హోం పద్ధతిలో ఇంటి వద్ద ఉండి కార్యాలయ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాలక్షేపం కోసం పుస్తక పఠనం అలవర్చుకుంటే ఖర్చు తగ్గడంతో పాటు పరిజ్ఞానం పెరుగుతుంది.

ఇంధనం అతిగా వద్దు

పెట్రోల్‌ బంకులకు వెళ్లి ద్విచక్రవాహనాలు, కార్లలో ట్యాంక్‌ ఫుల్‌గా ఇంధనాన్ని నింపుకొంటున్నారు. మరికొందరు డబ్బాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో అత్యవసరమైతే కనీసం ద్విచక్ర వాహనం, కార్లలో వెళ్లేందుకు అవకాశం ఉందని ఇలా చేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ఇంధనం సరఫరా కాకుంటే భవిష్యత్తులో పెట్రోల్‌ బంకులు కూడా మూతపడే అవకాశం ఉంది. అసలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ఈ పరిస్థితుల్లో అవసరం మేరకే ఇంధనం కొనుగోలు చేస్తే కొరత ఏర్పడదు.

ఇవీ చూడండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ABOUT THE AUTHOR

...view details