Taraka Ratna Latest Health Updates: సినీ నటుడు నందమూరి తారకరత్న జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి నేటి వరకూ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు ఎనిమిది రోజులుగా అవసరమైన చికిత్సలను అందిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయనకు ఆసుపత్రి వైద్యులు మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సను పూర్తి చేశారు.
ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ గత 8రోజులుగా తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స చేసిన అనంతరం స్కాన్ రిపోర్టర్ వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ, స్కాన్ నివేదిక ఆధారంగా తారకరత్నను విదేశాలకు తరలించే పరిస్థితి లేకపోవడంతో.. విదేశీ వైద్యులను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి రప్పించే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు.