Fever Survey in Telangana: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మరోమారు జ్వర సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రేపటి నుంచే జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణా చర్యలు, వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొని ఐదు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకోసం సిద్ధం చేసిన కోటి కిట్లను ఇప్పటికే గ్రామాల స్థాయి వరకు చేర్చినట్లు హరీశ్ రావు తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 340 మెట్రిక్ టన్నులకు పెంచామన్న ఆయన... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 500 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు.
ఉచితంగా కిట్లు
రాష్ట్రంలో 56 వేల కొవిడ్ పడకలు ఉన్నా.. కరోనాతో ఆస్పత్రిలో చేరే వారు చాలా తక్కువ. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కరోనా నిబంధనలు పాటించాలి. లక్షణాలు ఉన్నట్లయితే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా కిట్లు అందిస్తారు. రేపటి నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తాం. ఇందుకోసం కోటి కిట్లను సిద్ధం చేశాం. ---హరీశ్రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
వ్యాక్సినేషన్లో వెనుకంజలో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్లు, అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. టీకాల రెండు డోసుల మధ్య, బూస్టర్ డోసుకు అంతరాన్ని తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు. బూస్టర్ డోసు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్లో పురోగతి