తెలంగాణ

telangana

By

Published : May 3, 2023, 11:08 AM IST

ETV Bharat / state

Crop Damage: అకాల వర్షాలు.. అన్నదాతకు తీరని కష్టాలు

Crop Damage due to Untimely Rains in Telangana: ఏ రైతును కదిలించినా ఒక్కటే కథ.. కన్నీటి వ్యథ..! ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలైందని ఆవేదన..! అకాల వర్షంతో సృష్టించిన నష్టంతో అన్నదాత అతలాకుతలమయ్యాడు. వాన నష్టాలు దాటుకుని.. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా అక్కడా సవాళ్లే స్వాగతం పలుకుతున్నాయి. వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్న ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్నాడు.

crops loss in telangana
ఒక్కటే కథ... రైతుల కన్నీటి వ్యథ

అకాల వర్షాలు.. అన్నదాతకు తీరని కష్టాలు

Crop Damage due to Untimely Rains in Telangana: అకాలవర్షాలు అన్నదాతకు తీరని నష్టాలను మిగిల్చాయి. ఏ జిల్లాలో చూసినా చేతికొచ్చిన పంట నీటిపాలై రైతన్న కుదేలయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో అకాల వర్షాలకు 4,095 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. కేటి దొడ్డి, ధరూరు, గద్వాల మండలాలలో ఎక్కువగా నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. చేతికందిన పంట నీటిపాలవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కర్షకులు అలమటిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కూడా తడుస్తుండటంతో ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు.

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట సహా రాయపర్తి, పర్వతగిరి సంగెం మండలాల్లో.. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు అకాల వర్షానికి నేలవాలాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యపురాశులు వరదనీటిలో మునిగిపోగా వాటిని ఆరబెట్టేందుకు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోనూ ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. దంతాలపల్లి, కురవి, మరిపెడ, చిన్నగూడూర్, నరసింహులపేట, డోర్నకల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్, దుర్శేడ్ గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను, గోపాలపూర్​లో నష్టపోయిన ఉద్యాన పంటలను మంత్రి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లిలో వడగండ్ల వానకు దాదాపు 200 ఎకరాల వరి పంట పూర్తిగా నేల రాలిపోయింది. గత 12 రోజులుగా వరికోత యంత్రాలు దొరకక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

"రైతులు ఎక్కడఅధైర్య పడకూడదు. కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజను కొంటాము. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, కొనుగోలు కేంద్రానికి రాకుండానే భూమిపైనే పంట పోతే మాత్రం ప్రభుత్వం ఆదుకుంటుంది.ఇప్పటికే ఎఫ్​సీఐకి కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. తేమశాతంను 17నుంచి 20శాతానికి పెంచాలని కోరాం."_ గంగుల కమలాకర్‌, పౌరసరఫరాల శాఖమంత్రి

"ఉదయం, రాత్రి తేడా లేకుండా వర్షాలు పడుతున్నాయి. ధాన్యం అంతా తడిచి ముద్దయిపోతుంది. కొంత పంట చేనులో, కొంత కొనుగోలు కేంద్రంలో ఉంది. మమల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎంతో పెట్టుబడి పెట్టి మామిడి పంట వేస్తే అవి మొత్తం రాలిపోయాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించిన మమల్ని ఆదుకోవాలని కోరుతున్నాం."_ బాధిత రైతులు


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details