Problems with Dharani Website : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ధరణిని తీసుకొచ్చింది. భూముల చిక్కులు విప్పడంతో పాటు పారదర్శకతకు పెద్ద పీట వెయ్యాలన్న ఉద్దేశంతో ధరణి వెబ్సైట్ తెచ్చింది. సాంకేతిక సమస్యలతో ధరణిలో రైతుల భూములు ఒకరివి మరొకరి దాంట్లో నమోదు కావడం, కొందరి భూములు నిషేధిత జాబితాల్లో నమోదు చేయడం, లేదంటే కొన్ని సర్వే నంబర్లు మాయం కావడం.. ఇలాంటివి రైతులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ధరణి ఆపరేటర్ల నిర్వాకం..: వీటిని సరిదిద్దేందుకు రైతులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కలెక్టర్లకు అధికారం ఇవ్వగా.. చాలా వరకు సమస్యలు పరిష్కరించారు. అయితే ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనల్లో.. ధరణి పేరుతో కొందరు అక్రమాలకు తెరలేపుతుండటం ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచేలా చేస్తోంది. వ్యవస్థలోని లోపాలు ఆసరాగా చేసుకొని ధరణి ఆపరేటర్లు కొన్నిచోట్ల అధికారులకు తెలియకుండా, మరికొన్నిచోట్ల అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
బతికుండగానే చనిపోయినట్లు..: ధరణి లోపాలకు సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన మ్యాదరి లక్ష్మి.. జీవించి ఉండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి తహసీల్దార్కు తెలియకుండా మండల ధరణి ఆపరేటర్ సాయంతో ఆమె మనవడైన రాజకుమార్ 1.30 ఎకరాలకు తన పేరుతో వారసత్వ మార్పు చేయించుకున్నారు. లక్ష్మి చనిపోలేదని ఉన్నతాధికారుల విచారణలో తెలియడంతో ధరణి ఆపరేటర్ను గతేడాది డిసెంబరులో విధుల నుంచి తొలగించారు. తహసీల్దార్ను సస్పెండ్ చేశారు.
ఏడాది కిందట లింగంపేట మండలం బూరుగిద్దలో గ్రామస్థులు నివాసం ఉండే స్థలాన్ని కొందరు అక్రమార్కులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సదరు రిజిస్ట్రేషన్ రద్దు కోసం రెవెన్యూ అధికారులు సీసీఎల్ఏకు నివేదించి సరిపెట్టారు. గ్రామస్థుల విన్నపం మేరకు జీపీ నుంచి నివాస పత్రాలు పంపిణీ చేశారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన ఓ దివ్యాంగుడి పేరిట ధరణి పోర్టల్.. డమ్మీ ఖాతాలో 28 ఎకరాలు ఉన్నట్టు చూపిస్తోంది.