నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత రైతులు విత్తనోత్పత్తి(seeds production)లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తూ మంచి లాభాలను కళ్లజూస్తున్నారు. ఆదర్శ వ్యవసాయ విధానాలు పాటిస్తూ.. భూసారాన్ని కాపాడుకుంటూ మేలు రకం విత్తనాలు పండిస్తుండటంతో అవి ఇతర రాష్ట్రాలకే కాక విదేశాలకూ ఎగుమతవుతున్నాయి. విత్తన పంటలతో ఆదాయానికి ఢోకా లేకపోవడంతో ఈ ప్రాంతంలోని పలువురు రైతులు వాటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే అన్నదాతలు మరింత ప్రయోజనం పొందుతారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో(Agricultural research centers) శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండుకు అనుగుణమైన నూతన వంగడాలను తయారు చేసి అందిస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని వారు పేర్కొంటున్నారు.
40 ఏళ్ల క్రితం బీజం పడింది...
నాలుగు దశాబ్దాల కిందట 1980లో ఒక ప్రముఖ విత్తన కంపెనీ రైతులకు పశుగ్రాస జొన్న విత్తనాన్ని పరిచయం చేసింది. తిరిగి తామే కొనుగోలు చేసే(బైబ్యాక్) ఒప్పందం చేసుకొని మూల విత్తనాలిచ్చి, పండించిన పంటను కంపెనీయే కొనుగోలు చేసింది. వాటిని శుద్ధి చేసి ఇతర రాష్ట్రాల్లో విక్రయించేది. ప్రస్తుతం వివిధ కంపెనీలతోపాటు కొందరు రైతులూ ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇది లాభసాటిగా ఉండటంతో జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో విత్తన జొన్న(SORGHUM SEEDS) సాగవుతోంది. సజ్జ విత్తనోత్పత్తి(SAJJA SEEDS) కూడా 40 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. మొదట్లో నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా మూల విత్తనాలిచ్చేవారు. రైతులు పండించినవి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ప్రముఖ కంపెనీలతో పాటు స్థానిక కంపెనీలూ విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. జిల్లాలో 35 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది.
నేల స్వభావం.. రైతన్న కృషి ఫలితం
ఇక్కడ ఎర్రచల్క, నల్లరేగడి భూములున్నాయి. తమ పొలాల్లో చెరువు మట్టి, సేంద్రియ ఎరువులు వేస్తూ సారవంతం చేసుకుంటారు. నీటి వసతి కల్పించుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తారు. పంటలకు చీడపీడలు ఆశించకుండా చూసుకుంటారు. వారి కష్టానికి అనువైన నేలలు, అనుకూలమైన వాతావరణం ఉండడంతో పంటలు బాగా పండుతాయి. విత్తనాలు మంచి పరిమాణంలో వస్తాయి. మేలురకం గింజలు కావడంతో వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండు ఉంటోంది. నిజామాబాద్ జిల్లాలో 13 మండలాలు, నిర్మల్ జిల్లాలో కొంత, జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలో ఈ పంటలు సాగవుతున్నాయి. దాదాపు 70 వేల ఎకరాల్లో ఎర్ర, తెల్ల, ముళ్ల జొన్న, 50 వేల ఎకరాల్లో సజ్జ, పదివేల ఎకరాల్లో విత్తన వరి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటా దాదాపు రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతోంది.