'విద్యార్థుల నుంచి బాగా డిమాండ్ ఉన్న బీటెక్ కోర్సులు రెండే రెండు. అవి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏఐసీటీఈ, విశ్వవిద్యాలయాలు మాత్రం రెండు మూడు సెక్షన్లకు మించి అనుమతి ఇవ్వరాదని పరిమితి విధిస్తున్నాయి. ఫలితంగా కోరుకున్న కోర్సు కోసం కొందరు నాసిరకం కళాశాలల్లో చేరుతున్నారు. మరికొందరు ఇష్టం లేకున్నా ఇతర కోర్సుల్లో ప్రవేశాలు పొంది నష్టపోతున్నారు. విద్యార్థులకు ప్రయోజనం కలగాలంటే డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచడం మంచిదని నిపుణుల కమిటీ సూచిస్తోంది.'
-రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నియమించిన నిపుణుల కమిటీ
ఇంజినీరింగ్ విద్యలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, నూతన కళాశాలలకు అనుమతులు తదితర అంశాలపై 2020-21 విద్యా సంవత్సరానికి దృక్కోణ ప్రణాళికను పంపించాలని గత నెల 31న అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అన్ని రాష్ట్రాలను కోరుతూ లేఖలు రాసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్.. ఐఐటీ హైదరాబాద్ సంచాలకుడు బీఎస్ మూర్తి, ట్రిపుల్ఐటీ సంచాలకుడు నారాయణ్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకటరమణ తదితరులతో నిపుణుల కమిటీని నియమించారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద భర్తీ అవుతున్న బీటెక్ సీట్లలో కేవలం సీఎస్ఈ, ఐటీ బ్రాంచీల్లో చేరుతున్న వారే 43.34 శాతం మంది ఉన్నారు. యాజమాన్య సీట్లనూ కలుపుకొంటే 50 శాతం దాకా ఉంటారు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కమిటీ ఇటీవల సమావేశమై ప్రణాళికపై చర్చించింది. వచ్చే నెల 5న మరోసారి చర్చించి తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం దాన్ని ఏఐసీటీఈకి అందజేయనుంది.