తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2021, 7:00 AM IST

Updated : Jun 18, 2021, 7:15 AM IST

ETV Bharat / state

Vaccine: పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ ఇస్తే.. బిడ్డకూ రక్ష

పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? గర్భిణులకు ఎలాంటి వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చు? వీళ్లు వేసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ సమాధానమిచ్చారు.

Vaccine
Vaccine

పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల వారి పిల్లలకు కూడా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని, ఇది వ్యాక్సిన్‌ వల్ల కలిగే అదనపు ప్రయోజనమని ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ స్పష్టం చేశారు. ఇన్‌యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ను గర్భిణులకు ఇవ్వడం సురక్షితంగానే భావిస్తున్నామన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోనివారికంటే వేసుకొన్న వారిలో పరిస్థితి తీవ్రరూపం దాల్చి ఆసుపత్రిలో చేరిన, ఐసీయూలోకి వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువని తమ అధ్యయనంలో తేలిందన్నారు. మూడోవేవ్‌లో పిల్లలు ఎక్కువగా వైరస్‌ బారిన పడతారని తాను అనుకోవడం లేదన్నారు. వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజి (సీఎంసీ)లో వైరాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గగన్‌దీప్‌ కాంగ్‌ వ్యాక్సిన్లపై భారత్‌లో ప్రముఖ పరిశోధకురాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నియమించిన పలు సలహా కమిటీల్లో సభ్యురాలుగా ఉండటంతో పాటు ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీకి ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. కరోనా, వ్యాక్సినేషన్లపై వ్యక్తమవుతున్న పలు సందేహాలపై డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్​తో ఈనాడు-ఈటీవీ భారత్ప్రతినిధి ఎం.ఎల్​.నరసింహారెడ్డి ప్రత్యేక ముఖాముఖి...

  • కొవిడ్‌ను నిరోధించడంలో వ్యాక్సిన్లు ఎంత కాలం, ఎంత సమర్థంగా పని చేస్తాయి. దీర్ఘకాలంలో వాటి ప్రభావం గురించి ప్రజలకు అనేక సందేహాలున్నాయి...?

మనకు టీకాలు అందుబాటులోకి వచ్చి ఆరునెలలు అయింది. కొవిడ్‌ వైరస్‌ బారిన పడి కోలుకున్న వారికి కనీసం 8 నెలల పాటు మంచి రక్షణ ఉంటుంది. రోగనిరోధక స్పందన శక్తీ బలంగా ఉంటుంది. వ్యాక్సిన్‌ వల్ల రక్షణ ఏ స్థాయిలో ఉంటుందో వైరస్‌ సోకి తగ్గిన వారిలోనూ అదే స్థాయిలో రక్షణ ఉంటుంది. మొత్తమ్మీద కనీసం ఏడాది పాటు రక్షణ లభించే అవకాశం ఉంది. అది ఇంకెంత కాలం, అన్ని వ్యాక్సిన్లతోనూ ఉంటుందా అన్నది తెలియడానికి మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.

  • గర్భిణులకు వ్యాక్సిన్‌ వేయడానికి ఎందుకు ఊగిసలాడుతున్నాం? వీళ్లు వేసుకోవడం వల్ల సమస్యలు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉందా?

వ్యాక్సిన్‌లో ఉపయోగిస్తున్న ముడిపదార్థాల వల్ల భవిష్యత్తులో ఏమైనా అవుతుందన్న అనుమానంతో గర్భిణులకు వ్యాక్సిన్‌ వేయించడానికి వెనకడుగు వేస్తుంటాం. అయితే ఇన్‌యాక్టివేటేడ్‌ వ్యాక్సిన్‌ను గర్భిణులకు ఇవ్వడం సురక్షితంగా భావిస్తుంటాం. ఈ మార్గదర్శకాన్ని పరిగణనలోకి తీసుకొనే తీవ్రమైన జబ్బులతో ఎక్కువ రిస్క్‌తో ఉండే గర్భిణులకు, నెలలు నిండకముందే పిల్లలకు జన్మనిచ్చే అవకాశమున్న తల్లులకు కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నాం. అమెరికాలో 90 వేల మంది గర్భిణులు ఎం.ఆర్‌.ఎన్‌.ఎ వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. దీనివల్ల వచ్చిన సమస్యలు, ఫలితాలు రెండింటిని పరిశీలించారు. అతి తక్కువ మంది మాత్రమే నెలలు పూర్తిగా నిండకముందే ప్రసవించారు. గర్భిణులకు వ్యాక్సిన్‌ వేయడంపై ప్రస్తుతం అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి.

  • పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా? కొన్ని నెలలు వేచిచూడాలా?

పాలిచ్చే మహిళలలకు కచ్చితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలి. ప్రసవించిన తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు. తల్లులు వ్యాక్సిన్‌ తీసుకొన్న ఫలితంగా పిల్లలకు యాంటీబాడీస్‌ బదిలీ అయ్యాయని ప్రస్తుతం అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు మరీ చిన్న పిల్లలకు కొవిడ్‌ టీకా వేయడం వీలుకాదు కాబట్టి పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ వేయడం వల్ల అదనపు ప్రయోజనం చేకూరుతుంది.

  • ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎలా ఉంది? ఎలాంటి మార్పులు సూచిస్తారు?

తగినంత సరఫరా లేక దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా సాగడం లేదు. కొన్ని నెలల్లో ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చు. వచ్చిన ప్రతి డోసు వ్యాక్సిన్‌ను మనం వినియోగించుకొని వీలైనంత తొందరగా ప్రతిఒక్కరికి వేయాలి. అయితే జబ్బులతో బాధపడుతూ రిస్క్‌తో ఉండేవారు, పెద్దలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలి.నా ఆందోళన అంతా ఏంటంటే మనం గ్రామీణ ప్రాంతాలపై తగినంతగా దృష్టి పెట్టడం లేదు.

  • నిర్ణీత గడువు కంటే ముందుగానే రెండోడోస్‌ తీసుకొంటే ఏమవుతుంది?

అది ఏ వ్యాక్సిన్‌ అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. కొవాగ్జిన్‌కు రెండు డోసుల మధ్య నాలుగు వారాల గడువు ఉంది. రెండో డోసును ముందుగా తీసుకొంటే వ్యాక్సిన్‌ను వృథా చేసినట్టే. ఎందుకంటే దీనివల్ల బూస్టర్‌ ఎఫెక్ట్‌ రాదు. అదే కొవిషీల్డ్‌ అయితే నాలుగు వారాల తర్వాత ఎప్పుడైనా ఫర్వాలేదు. అయితే రెండు డోసుల మధ్య గ్యాప్‌ ఎక్కువ ఉంటే మరింత సమర్థంగా ఉంటుంది.

  • రెండు డోసుల వ్యాక్సిన్‌ తర్వాత కూడా యాంటీబాడీలు వృద్ధికాలేదని రెండు మూడు నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌ను వేసుకోమని కొందరు సూచిస్తున్నారు? ఇది సరైందేనా?

మనం కొలిచే యాంటీబాడీలకు, సంరక్షణకు పరస్పర సంబంధం లేదు. నా సలహా కొంతకాలం వేచి ఉండమని. వ్యాక్సినేషన్‌ తర్వాత రోగనిరోధక ప్రతిస్పందన ఎలా ఉండాలి? ఏ స్థాయిలో ఉంటే మనకు రక్షణ లభిస్తుందన్నదానిపై పరిశోధన జరుగుతోంది. ఇది పూర్తయితే ఆసక్తి ఉన్న వారు యాంటీబాడీల పరీక్ష చేయించుకోవచ్చు. రోగనిరోధక శక్తి లేని వారికి బూస్టర్‌ డోసు అవసరం కావచ్చు.

  • మూడోదశలో చిన్నపిల్లలు ఎక్కువగా వైరస్‌ బారిన పడతారని, పడరని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిపాయ్రం ఏంటి?

మూడోదశలో పిల్లలు ఎక్కువగా వైరస్‌బారిన పడతారని అనుకోను. మొదటి, రెండో వేవ్‌లో కూడా పిల్లలు వైరస్‌బారిన పడ్డారు. ఇందులో తక్కువశాతం మందికి మాత్రమే తీవ్రమైంది. మా సీఎంసీ లో 700 మందికి పైగా కొవిడ్‌బారిన పడిన పిల్లలు చేరారు. అంతకు ముందు ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో అతి తక్కువ మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చింది. ఆసుపత్రిలో చేరిన పిల్లల్లో ఎక్కువమంది అంతకు ముందే వేరే సమస్యలతో బాధపడుతున్న వాళ్లు.

  • కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఒక డోస్‌తోనే యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి, రెండో డోసు అవసరం లేదని తాజాగా కొన్ని అధ్యయనాల్లో తేలినట్లు చెప్పారు. దీనిపై మీరేమంటారు?

సింగిల్‌ డోసు ఇవ్వడం కొన్ని వ్యాక్సిన్లలో కచ్చితంగా సాధ్యమవుతుంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, స్పుత్నిక్‌ లైట్‌ టీకాలకు ఒక డోసునే ప్రతిపాదించారు. అయితే వైరస్‌బారిన పడిన వారికి అన్ని వ్యాక్సిన్లు సింగిల్‌డోసు ఇస్తే సరిపోతుందా అన్న విషయంలో ప్రస్తుతానికి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు.

  • రెండు డోసుల మధ్య సమయాన్ని ప్రభుత్వం పెంచడానికి కారణమేంటి? ఇది శాస్త్రీయంగా సమర్థనీయమేనా?

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రకారం రెండు డోసుల మధ్య గడువు పెంచితే రక్షణ పెరుగుతుందని తేలింది. ఈ డేటా ఆధారంగా రెండు డోసుల మధ్య గడువును యు.కె.నిర్ణయించింది. ఇదే డేటా ప్రస్తుతం అల్ఫా వేరియంట్‌కు, డెల్టా వేరియంట్‌కు కూడా అందుబాటులో ఉంది. దీని ప్రకారం ఒక డోసు వ్యాక్సిన్‌.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా మంచి రక్షణ ఇస్తుందని తేలింది. మరోవైపు రెండు డోసుల మధ్య గడువును తగ్గించాలని యు.కె. నిర్ణయించింది. దీనికి కారణం వారి జనాభాలో ప్రాధాన్యంగా నిర్ణయించిన వారికి మొదటి డోసు వ్యాక్సిన్‌ను వేయడం ఇప్పటికే పూర్తి చేయడమే. భారతదేశంలో రెండు డోసుల మధ్య గడువును పెంచడం శాస్త్రీయంగా సరైందే. ఈ నిర్ణయాన్ని చాలా ముందుగానే తీసుకొని ఉంటే ఎక్కువ జనాభాకు వ్యాక్సినేషన్‌ వేయగలిగి ఉండేవాళ్లం.

  • ప్రజలు.. ప్రత్యేకించి వ్యాక్సిన్‌ వేసుకొన్నవారు యాంటీబాడీల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు వీటి గురించి ఏ మేరకు పట్టించుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి పరీక్ష చేసుకోవాలా? వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణలో వీటికి ప్రాధాన్యం ఉందంటారా?

వ్యాక్సిన్‌ వేయించుకొన్నాక చాలా మంది యాంటీబాడీల గురించి తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకొంటున్నారు. కానీ ఆ అవసరం లేదన్నది నా అభిప్రాయం. తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశమేంటంటే ఇందుకోసం చేస్తున్న రెండు రకాల పరీక్షల మధ్య ఎక్కడా పోలిక లేదు. ఒక పరీక్షలో ఐదు యాంటీబాడీలు వస్తే ఇంకోరకం పరీక్షలో అవి 150కి సమానం కావచ్చు. ఈ యాంటీబాడీ పరీక్షల వల్ల వచ్చే ఫలితాలు ఇన్‌ఫెక్షన్‌ లేదా వ్యాధి నుంచి రక్షణకు సంకేతాలని ఏమీ చెప్పలేం. రక్షణ ఏ మేరకు ఉంటుందన్నది న్యూట్రలైజ్డ్‌ యాంటీబాడీస్‌ వల్ల తెలుస్తుంది. ఏ రకమైన యాంటీబాడీలు రక్షణ ఇస్తాయి, ఏ స్థాయి వరకు అన్నది తెలుసుకోవడంపై శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు, ప్రస్తుతానికైతే దీనిపై ఏం చెప్పలేం.

  • యాంటీబాడీలతో పాటు ఎముక మజ్జలోని టి కణాల గురించి కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీని గురించి వివరిస్తారా?

మన రోగ నిరోధక వ్యవస్థలో ప్రధానంగా రెండు రకాల కణాలుంటాయి. ఒకటి బి కణాలు.. రెండోది టి కణాలు. బి కణాలు వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. టి కణాలు మాత్రం భిన్నంగా స్పందిస్తాయి. టి కణాల్లోనూ ప్రధానంగా రెండు రకాల కణాలుంటాయి. 1. టి హెల్పర్‌ సెల్స్‌ (సీడీ 4 కణాలు). 2. సైటో టాక్సిక్‌ సెల్స్‌ (సీడీ 8 కణాలు). వీటినే కిల్లర్‌ సెల్స్‌ అని కూడా అంటారు. బి కణాల ద్వారా యాంటీబాడీలు రావడానికి పరోక్షంగా టి హెల్పర్‌ కణాలు తోడ్పాటునందిస్తాయి. అయితే బి కణాలు, టి కణాల్లోనూ మెమొరీ సెల్స్‌ అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటాయి. ఇవి తక్కువ సంఖ్యలో ఉన్నా వైరస్‌ను గుర్తుపెట్టుకొని అవసరమైనప్పుడు మాత్రం ప్రతాపాన్ని చూపిస్తాయి. మరోసారి వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మెమొరీ సెల్స్‌ వెంటనే అవసరాలకు తగ్గట్లుగా తమ సంఖ్యను పెంచుకుంటాయి. వైరస్‌పై దాడి చేసి ప్రాథమిక దశలోనే నిర్వీర్యం చేస్తాయి. అయితే కొవిడ్‌పై పోరులో బి, టి కణాల మధ్య సంబంధాన్ని మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరముంది. ఎందుకంటే కరోనా వైరస్‌లు చాలా రకాలున్నాయి. అవి కూడా మనల్ని ఇప్పటికే ఇన్‌ఫెక్షన్‌కు గురిచేసి ఉండొచ్చు. వాటి వల్ల ఏర్పడిన రోగ నిరోధక శక్తి.. ఇప్పుడు కొవిడ్‌ 19ను ఎదుర్కోవడంలో ఎంత మేరకు రక్షణ ఇస్తుందనే కోణంలోనూ పరిశోధనలు జరగాలి. కొవిడ్‌ సోకిన వారిలోనూ ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నవారిలో, స్వల్ప లక్షణాలతో వైరస్‌ బారినపడినవారిలో అత్యధికుల్లో యాంటీబాడీల సంఖ్య చాలా స్వల్ప సంఖ్యలో నమోదవడం, కొన్నిసార్లు అసలు లేకపోవడం వంటివి చూస్తున్నాం. ఇటువంటి వారిలో టి కణాల ద్వారా వీరికి రక్షణ ఏమేరకు ఉందనేది తెలుసుకోవాలి. ఎంతకాలం టి కణాల ప్రభావం ఉంటుందనేది కూడా పరిశోధించాలి. సామాజికంగా వీటి స్పందనలను పరిశోధించి అంచనా వేయాలి. కొందరిలో కొవిడ్‌ సోకిన తర్వాత ఏర్పడిన యాంటీబాడీలు కొద్ది కాలంలోనే తగ్గుతున్నాయి. వీరిలో దీర్ఘకాలం రక్షణ రక్షణ పొందడానికి టి కణాల పాత్ర ఏ మేరకు ఉందనే కోణంలోనూ పరిశోధన జరగాల్సిన అవసరముంది.

  • రెండు డోసుల తర్వాత కూడా ప్రజలు ఎందుకు కొవిడ్‌ బారిన పడుతున్నారు? అక్కడక్కడా మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది. మీ అధ్యయనంలో తేలిందేంటి?

వ్యాక్సిన్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమనిపిస్తోంది. వైరస్‌ బారిన పడకుండా టీకాలు అడ్డుకొంటాయని అనుకోవద్దు. వ్యాధి తీవ్రం కాకుండా, మరణాల బారిన పడకుండా రక్షిస్తాయి. దీంతోపాటు గుర్తించాల్సింది ఏంటంటే వ్యాక్సిన్లు పరిపూర్ణమైన రక్షణ ఇవ్వవు. మన చుట్టూ చాలా ఎక్కువగా వైరస్‌ ఉన్నప్పుడు టీకా తీసుకున్నవారూ దాని బారిన పడే అవకాశం ఉంది.అయితే వ్యాక్సిన్‌ వేసుకోని వారికన్నా వేసుకున్న వారిలో తీవ్రత తక్కువగా ఉంటుంది. వీరిలో ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి, మరణాలు చాలా తక్కువ. మా క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ) పరిశీలనలో కూడా ఇదే తేలింది. మూడు నెలల వ్యవధిలో ఒకటి, రెండు డోసులు వేసుకొన్నవారిలో పదిశాతం మంది వైరస్‌ బారిన పడ్డారు. అయితే వ్యాక్సిన్‌ వేసుకోని వారితో పోల్చితే ఇది మూడో వంతే. పూర్తిగా వ్యాక్సిన్‌ వేసుకొన్న 7080 మంది, ఒక డోసు వేసుకొన్న 1878 మంది, అసలు టీకా వేసుకోని 1609 మందిపైన మా దగ్గర అధ్యయనం జరిగింది.

  • మొదట ఒక వ్యాక్సిన్‌ వేసుకొని రెండో డోసు వేరే వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదేనా? దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?

రెండు రకాల వ్యాక్సిన్లను కలిపి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇచ్చినట్లున్నారు. ఇది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు లేదా ఓ రకం వ్యాక్సిన్‌ కొరత వల్ల కావొచ్చు. ఒకడోసు కొవాగ్జిన్‌, రెండో డోసు కొవిషీల్డ్‌ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందన్నదానిపై ఎలాంటి డేటా లేదు. రెండు కారణాల దృష్ట్యా దీనిపై అధ్యయనాలు జరగాల్సి ఉంది. మొదటిది రెండు రకాల వ్యాక్సిన్లు ఇవ్వొచ్చని తేలితే వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రయోజనం ఉంటుంది. రెండోది రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చే పద్ధతి వల్ల స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో రక్షణ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 18, 2021, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details