విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ అప్డేట్ చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని నాబార్డ్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులు నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాబార్డ్లో కొత్త నియామకాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ నవీకరణ సమస్యలు పరిష్కరించాలంటూ విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మాజీ ఉద్యోగుల పెన్షన్ పెంచకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.
పెన్షన్ అప్డేట్ చేయకపోవడం హక్కుల ఉల్లంఘనే : ప్రొ.నాగేశ్వర్
కేంద్ర ప్రభుత్వ రంగంలోని నాబార్డ్ మాజీ ఉద్యోగుల పెన్షన్ అప్డేట్ చేయకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని నాబార్డ్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం తక్షణమే పెన్షన్ నవీకరణ, ఆర్థిక ప్యాకేజీ, నియామకాలు చేపట్టాలంటూ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు పెంచుతున్నారు కానీ.. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ ఎందుకు పెంచడం లేదని నాగేశ్వర్ ప్రశ్నించారు.
నాబార్డ్లో ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాల కింద బాధిత కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆఫీసర్స్, ఎంప్లాయిస్ అండ్ రిటైరీస్ ఆఫ్ నాబార్డ్ హైదరాబాద్ యూనిట్ అధ్యక్షుడు పాలాది మోహనయ్య, ఆల్ ఇండియా నాబార్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, కె.కైలాసపతి, నేతలు పాల్గొన్నారు.