తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​తో అంచనాలు తలకిందులు... పద్దులో భారీ వృద్ధి

అంచనాలకు భిన్నంగా భారీ పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 20 శాతం అంచనాలను పెంచుతూ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. ఎప్పటిలాగే సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూనే బడ్జెట్​లో ప్రాధాన్య పనులకు భారీగా నిధులను ఏర్పాటు చేసింది. కొత్తగా కొన్నింటికి నిధులు కేటాయించింది.

By

Published : Mar 9, 2020, 6:35 AM IST

Updated : Mar 9, 2020, 7:56 AM IST

పద్దులో 20 శాతంతో భారీ వృద్ధి
పద్దులో 20 శాతంతో భారీ వృద్ధి

20 శాతం భారీ వృధ్ధితో ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టింది. 2019-20 బడ్జెట్ అంచనాలను రూ. లక్షా 46 వేల కోట్ల నుంచి రూ. లక్షా 43 వేల కోట్లకు సర్కార్ సవరించింది. రానున్న ఆర్థిక సంవత్సరం 2020-2021కి ఏకంగా రూ. లక్షా 82 వేల కోట్ల పద్దును ప్రతిపాదించింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఆశించిన మేర రాబడులు లేవంటూనే పద్దులో వృద్ధిని భారీగా పెంచింది. 2019-20 లో ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర రెవెన్యూ వృద్ధి రేటును 6.3గా ప్రభుత్వం పేర్కొంది.

ఏకంగా దానికి మూడు రేట్ల మేర బడ్జెట్ పద్దును పెంచేసింది. స్వీయ ఆదాయాన్ని పెంచుకోవడం, నిరర్ధక ఆస్తుల అమ్మకం, పెట్టుబడి వ్యయంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచుతామన్నారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. తద్వారా బడ్జెట్ అంచనాలను చేరుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

సంక్షేమానికి, వ్యవసాయానికి పెద్దపీట !!

తెరాస ప్రభుత్వం మొదట్నుంచి చెప్తున్నట్లుగానే సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట వేసింది. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించింది. లబ్ధిదారుల సంఖ్య పెరగడం వల్ల సంక్షేమ పథకాలకు అధిక కేటాయింపులు చేసింది. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులను భారీగా పెంచింది. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, గురుకులాలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రెండు పడకల ఇళ్ల కేటాయింపుల్లోనే ఏకంగా రూ. 15 వేల కోట్ల మేర పెరుగుదల ఉంది.

పలు కొత్త కార్యక్రమాలకూ బడ్జెట్​లో కేటాయింపులు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. పదివేల కోట్లు, మార్కెట్ ఇంటర్వెన్షన్​కు రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించింది. గోదావరి నదీ తీరప్రాంత పర్యటకానికి రూ. 300 కోట్లు, అందరికీ విద్య కోసం రూ. వంద కోట్లు కేటాయించింది.

పటిష్ఠ విధానాలు, గట్టి సంస్కరణలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలను దాదాపుగా అందుకుంటున్నామని ప్రభుత్వం అంటోంది. ఇదే తరహాలో వచ్చే ఏడాది కూడా బడ్జెట్ అంచనాలను చేరుకునేలా పటిష్ఠ విధానాలు, గట్టి సంస్కరణలు అమలు చేస్తామని మంత్రి హారీశ్ వెల్లడించారు. వివిధ మార్గాల ద్వారా స్వీయ ఆదాయాన్ని పెంచుకుని పేదలకు పంచుతామని మంత్రి స్పష్టం చేశారు.

పద్దులో 20 శాతంతో భారీ వృద్ధి

ఇవీ చూడండి : వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.రెండు లక్షల కోట్ల అప్పు

Last Updated : Mar 9, 2020, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details