అధికారులతో మంత్రి సమావేశం మార్చి నెలాఖరులోగా రాష్ట్రాన్ని పూర్తి బహిర్భూమి రహితంగా ప్రకటించే లక్ష్యంతో పని చేయాలని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రామాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు నిధులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని సెర్ప్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జాబ్మేళాలపై దృష్టి
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్మేళాల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నూతన పంచాయతీ భవనాల నిర్మాణాన్ని ఉపాధి హామీ కింద చేపట్టాలని పేర్కొన్నారు. శ్మశాన వాటికలు లేని గ్రామాలకు భూసేకరణ నిమిత్తం రూ.2 లక్షలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
పచ్చదనం వెల్లివిరియాలి
గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో వంటగదులు, మూత్రశాలలు, పొలాల్లో నీటికుంటల నిర్మాణ పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఎర్రబెల్లి ఆదేశించారు.
ఇవీ చదవండి :వైద్యానికి ఇక్కడికే రావాలి