తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2021, 11:08 AM IST

ETV Bharat / state

EIU: పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక ఆర్థిక నిఘా కొరడా

రాష్ట్రంలో పన్ను ఎగవేతదారుల పని పట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖలో ఏర్పాటైన ప్రత్యేక ఆర్థిక నిఘా విభాగం(Economist Intelligence Unit​) కీలకపాత్ర పోషిస్తోంది. పన్ను చెల్లింపులకు దూరంగా ఉంటున్న వ్యాపార, వాణిజ్య సేవలను గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తుంది. రాష్ట్రానికి రావల్సిన పన్నులు ఇతర రాష్ట్రాలకు పోకుండా నిలువరించడంలోనూ ప్రధాన భూమిక పోషిస్తోంది.

economist intelligence unit, eiu on tax evaders
ప్రత్యేక ఆర్థిక నిఘా విభాగం, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక ఆర్థిక నిఘా కొరడా

రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేక ఆర్థిక నిఘా విభాగం(Economist Intelligence Unit) కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో చెల్లించాల్సిన పన్నులు ఇతర రాష్ట్రాల్లో చెల్లిస్తుండడం లాంటి వాటిని గుర్తించేందుకు 2018 సెప్టెంబరులో ఇది ఏర్పాటైంది. ఈ విభాగం అదనపు కమిషనర్‌ నేతృత్వంలో దాదాపు 30 మంది అధికారులు, సిబ్బందితో పని చేస్తున్నారు. విలువ ఆధారిత పన్ను-వ్యాట్‌(vat) స్థానంలో 2017లో జులై నుంచి వస్తు సేవల పన్ను-జీఎస్టీ వచ్చింది. వ్యాట్‌ను ఆరిజిన్‌ బేస్‌డ్‌ ట్యాక్స్‌గా, జీఎస్టీ(GST) యుటిలైజేషన్‌ బేస్‌డ్‌ ట్యాక్స్‌గా పిలుస్తారు. అంటే వ్యాట్‌ అమలులో ఉన్నప్పుడు పరిశ్రమలు ఎక్కువగా ఉండి ఉత్పత్తి అయ్యే రాష్ట్రాల్లో ఎక్కువ పన్నులు వచ్చేవి. జీఎస్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే వస్తువులుకాని, సేవలుకాని వినియోగం ఉంటుందో అక్కడే పన్నులు చెల్లించాలి.

ప్రత్యేక భూమిక

జీఎస్టీ చట్టం-2017కు అనుగుణంగా ఆయా సంస్థలు సాప్ట్‌వేర్‌లో మార్పులు చేసుకుని పన్ను చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ చాలా సంస్థలు అలా చేయకుండా గతంలో మాదిరిగానే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిరునామాలనే ఉంచడంతో... రాష్ట్రానికి రావాల్సిన పన్నులు ఇతర రాష్ట్రాలకు వెళ్తుండేవి. అలాంటి వాటిని గుర్తించి... ఎగవేతకు గురవుతున్న పన్నులు వసూలు చేసేందుకు రెగ్యులర్‌ అధికారులతో సాధ్యం కాదని అప్పటి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి, ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గుర్తించారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలను గుర్తించడం కోసం ఈ నిఘా ప్రత్యేక భూమిక పోషిస్తోంది.

ప్రభుత్వ ఆదాయం కోసం

ప్రత్యేక ఆర్థిక నిఘా విభాగం ఎగవేతకు గురైన వసూళ్లు, పక్కదారి పడుతున్న పన్నులను గుర్తించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టేందుకు ఏర్పాటైంది. ఏటా ఈ విభాగం ప్రత్యేక డ్రైవ్‌ పేరున ముందుకు వెళ్తోంది. 2018-19 ఆర్థిక ఏడాదిలో "రెవెన్యూ ఆక్సన్‌ ప్లాన్‌-ర్యాప్‌'' పేరుతో, 2019-20లో "రెవెన్యూ ఎనాన్స్‌మెంట్‌ ఆక్సన్‌ ప్లాన్‌-రీప్‌'' పేరుతో, 2020-21లో "ఫోకస్‌డ్‌ రెవెన్యూ డ్రైవ్‌-ఎఫ్‌ఆర్‌డీ'' పేరున ఈ ఆర్థిక నిఘా విభాగం-ఈఏయూ పని చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి నుంచి కొవిడ్‌ ప్రభావం ఉండడంతో ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఏటా ఎగవేతకు గురైన, పక్కరాష్ట్రాలకు పోతున్న రూ.వందల కోట్ల పన్నులు ఈ విభాగం గుర్తిస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఏం చేస్తుంది?

అద్దె చెల్లింపుదారులు భవన నిర్మాణదారులతో అగ్రిమెంటు రాసుకుని ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ కూడా చేయిస్తున్నారు. ఇందులో ఏడాదికి రూ.20లక్షలకుపైగా అద్దెలు ఉన్న భవనాల ఆదాయంపై 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో లీజ్‌ అగ్రిమెంట్లు కింద నడుస్తున్న పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు తదితర వాటికి చెందినవి ఎన్ని ఉన్నాయి? అందులో పన్ను పరిధిలోకి వచ్చే అగ్రిమెంట్లు ఎన్ని? తదితర అంశాలను నిశితంగా పరిశీలించి... వసూలు చేసేందుకు సంబంధిత డిప్యూటీ కమిషనర్‌కు ఈ వివరాలను పంపిస్తుంది. అదే విధంగా ఎయిర్‌ టెల్‌ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖాతాలోనే జీఎస్టీ చెల్లిస్తూ వచ్చింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన పన్ను కూడా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తుండేది. దీనిని గుర్తించి రాష్ట్రంలో జరుగుతున్న ఎయిర్‌ టెల్‌ వ్యాపారంపై రావాల్సిన పన్నులను ఇక్కడ వసూలయ్యేట్లు చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, ఆర్టీసీ ఇలా పలు సంస్థలు రాష్ట్రంలో సేవలు అందిస్తుండగా... ఆ వచ్చే పన్ను మాత్రం ఇతర రాష్ట్రాలకు పోతోంది. ఇలాంటి వాటిని ప్రత్యేక విభాగం పరిశీలిస్తుంది.

ఇలా గుర్తిస్తుంది!

ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌-ఐఎస్‌బీలో చదవే కోర్సులకు లక్షలాది రూపాయిలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తారు. దానిపై చెల్లించాల్సిన పన్నులు రాష్ట్రానికి చెల్లించడం లేదని గుర్తించి... కట్టించినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఇవి కాకుండా ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే సంస్థలకు చెంది... రాష్ట్రంలో విక్రయాలు జరిగే వాటి వ్యాపారం విలువ ఎంత? దానిపై వసూలు కావాల్సిన పన్ను ఎంత తదితర వాటిని నిశితంగా పరిశీలించి ఎగవేతకు పాల్పడిన మొత్తం నిర్ధారిస్తారు.

లోతైన నిఘా

ప్రధానంగా ఈ-కామర్స్‌ ద్వారా జరుగుతున్న వ్యాపారంలో రాష్ట్రానికి రావాల్సిన పన్నులు... ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న రాష్ట్రాలకు పోతున్నట్లు గుర్తించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏయే సంస్థలు ఎంత వ్యాపారం తెలంగాణ రాష్ట్రంలో చేశాయి? దానిపై రావాల్సిన జీఎస్టీ ఎంత అనేదానిపై అధ్యయనం చేస్తోంది. రూ.వంద కోట్లకుపైగా ఆయా సంస్థల నుంచి ప్రభుత్వానికి రావాల్సి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించిన ఆర్థిక నిఘా విభాగం లోతైన అధ్యయనం ద్వారా నిగ్గు తేల్చే పనిలో ఉంది.

ఇదీ చదవండి:పెగాసస్ వివాదంతో ప్రతిపక్షం సంఘటితం!

ABOUT THE AUTHOR

...view details