తెలంగాణ

telangana

ETV Bharat / state

మహాశివరాత్రి స్పెషల్.. రాష్ట్ర వ్యాప్తంగా కిటకిటలాడుతున్న పండ్ల మార్కెట్లు - Mahashivratri

Rush at Fruit Markets in Telangana: మహాశివరాత్రి వేళ రాష్ట్రవ్యాప్తంగా పండ్ల మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్​లోని పండ్ల మార్కెట్లలో భారీగా రద్దీ నెలకొంది. నగర శివారు బాట సింగారం పండ్ల మార్కెట్‌.. రైతులు, కమీషన్‌ ఏజెంట్లు, వినియోగదారులతో రద్దీగా దర్శనమిస్తున్నాయి. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాల కోసం అవసరమైన పండ్లు కొనుగోలు చేయడానికి వినియోగదారులు, చిరు వ్యాపారులు పోటెత్తడంతో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు సాగుతున్నాయి.

fruit market
fruit market

By

Published : Feb 18, 2023, 7:10 AM IST

Rush at Fruit Markets in Telangana: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వచ్చిందంటే చాలు వివిధ రకాల పండ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రతి కుటుంబంలో పండ్ల వినియోగం తప్పసరి కావడంతో మార్కెట్‌కు పండుగ కళ వచ్చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండ్ల క్రయ, విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్​ శివారు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో వ్యవసాయ మార్కెట్ యార్డుకు పండ్లు భారీ ఎత్తున తరలివచ్చాయి. అవసరమైన పండ్లను మార్కెట్‌లో అందుబాటులో పెట్టడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటెత్తుతున్నారు.

Mahashivratri : పండుగ వేళ మంచి ధరలు వస్తాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, ఆపిల్, పుచ్చకాయ, ఖర్భూజ, పైనాపిల్, మామిడి తదితర పండ్లు విక్రయానికి తీసుకురావడంతో సందడి వాతావరణం నెలకొంది. గత ఏడాది శివరాత్రి సమయంతో పోల్చితే ఈసారి బాటసింగారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ పండ్ల రాక బాగా పెరిగిపోయింది. వాతావరణం ఆశాజనంగా ఉండటంతో.. ఈ సీజన్‌లో పండ్ల ఉత్పత్తి ఎక్కవగా మార్కెట్‌కు తరలివస్తోంది.

నాలుగు రోజుల ముందు నుంచే పండ్ల రాక అధికమైన దృష్ట్యా.. ఒకదశలో ధరలు పడిపోతాయో అన్న భయం రైతుల్లో నెలకొంది. కానీ ధరలు స్థిరంగా ఉండటంతోపాటు రేట్లు కూడా బాగానే పెరిగాయి. పండ్లన్నీ టోకు ధరల్లో విక్రయిస్తున్న దృష్ట్యా... నాణ్యత, పరిమాణం బట్టి నల్ల ద్రాక్ష 7 కిలోల బాక్సు 350 నుంచి 400 రూపాయలు, వైట్ గ్రేప్స్ 15 కిలోల బాక్స్ 1000 నుంచి 1400 రూపాయలు, పుచ్చకాయ పది కిలోలు 100 రూపాయలు, ఖర్భూజ పది కిలోలు 170 నుంచి 200 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు.

గతంలో కొత్తపేటలోని గడ్డిఅన్నారం వ్యవసాయ యార్డులో మార్కెట్ కొనసాగినప్పుడు 22 ఎకరాల విస్తీర్ణంలో నిత్యం రద్దీ ఉండేది. అక్కడి నుంచి తాత్కాలికంగా 40 ఎకరాల విస్తీర్ణం గల బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు తరలించిన తర్వాత తొలినాళ్లల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు అన్నీ సమస్యలు తొలగిపోవడంతో పండ్ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. శివరాత్రి వేళ... చిన్న చిన్న మార్కెట్​లలో పండ్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో... కాస్త దూరభారమైనా వినియోగదారులు బాటసింగారం విచ్చేసి టోకు ధరల్లో కొనుగోలు చేసి వెళుతున్నారు. పుచ్చకాయ, ఖర్భూజ, ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, పైనాపిల్‌, సపోట, బత్తాయి, ఇతర పండ్లు భారీగా తరలిరావడంతో వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని మార్కెటింగ్‌శాఖ అధకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా శివరాత్రి పర్వదినం ప్రతి ఇంట్లో పండ్లు తినడం అనవాయితీ. రంజాన్‌, క్రిస్మస్‌ లాంటి పండుగల తరహాలో మహా శివరాత్రివేళ పండ్ల మార్కెట్లు కొత్త కళ సంతరించుకున్నాయి. రైతుల సౌకర్యార్థం... ఉగాది పండుగకు ముందే మార్చి ఒకటినే మామిడి సీజన్‌ మొదలవుతున్న దృష్ట్యా కొనుగోళ్ల కోసం మార్కెటింగ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details