Drones usage in Agriculture: వ్యవసాయ డ్రోన్లు సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త రెక్కలు విప్పనున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు వీటి వినియోగం ఓ పరిష్కారంగా కనిపిస్తోంది. కేంద్రం బడ్జెట్లో చేసిన వ్యవసాయ డ్రోన్ల ప్రకటన ఈ రంగంపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇంతకీ డ్రోన్లతో ఉపయోగాలు ఏమిటి. ఎన్ని రకాలుగా వీటిని వినియోగించవచ్చు. ఏ తరహా పంటలకు ఇవి అనుకూలం, డ్రోన్ల విస్తృతికి ఉన్న అడ్డంకులేంటి. ప్రభుత్వాలు ఏంచేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం తీరు మారుతోంది. కొన్నేళ్ల నుంచి యంత్రాల వాడకం బాగా పెరిగింది. వాటితో పాటు సాంకేతిక పరిజ్ఞానం వాడకం తప్పనిసరిగా మారింది. కూలీల కొరత రైతులకు ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు ఉన్న అవకాశాలపై అందరూ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో దూసుకు వచ్చిందే డ్రోన్ల వినియోగం. మొదట్లో రక్షణ రంగంలో ఉన్న డ్రోన్ల వినియోగం ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించింది. వ్యవసాయంలో డ్రోన్ల వాడకంలో జపాన్, చైనా, ముందుండగా ఇటీవల కాలంలో ఇతర దేశాల్లోనూ ఈ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విరివిగా వాడడం మొదలు పెట్టారు.
Technology usage in Agriculture : ఈ క్రమంలో భారత్లోనూ డ్రోన్ల వాడకంపై ప్రయోగాలు జరిగాయి. ప్రధానంగా పంటలకు పురుగుమందుల పిచికారి, ఎరువులు, విత్తనాలు వెదజల్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు. పురుగుమందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలనిస్తోంది. వరిసాగు చేసే రైతులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బురదలో దిగి సాధారణ స్ప్రేయర్లతో మందుల పిచికారీ పెద్ద ప్రయాసే. చాలామంది తేళ్లు, పాముకాట్ల బారిన పడేవారు. అలాగే ఎత్తులో పెరిగే పంటలకు సంబంధించి పిచికారి కష్టమైన పని. మొక్కజొన్నతో పాటు పండ్ల తోటల్లో ఈ సమస్య ఎక్కువగా ఎదురయ్యేది. ఇలాంటి వాటికి డ్రోన్లు పరిష్కారం చూపాయి. డ్రోన్ సాయంతో పైనుంచి పిచికారీ చేయటం సులువైంది.
డ్రోన్ల వాడకంతో సమయం బాగా కలిసొచ్చింది. ఎకరా పొలానికి 5నుంచి 6 నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుంది. మామూలు స్ప్రేయర్లతో గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. పంటకు తెగులు వచ్చినప్పుడు ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూలీలు దొరక్క పిచికారీ అలశ్యమైతే పంట పాడైపోయేది. డ్రోన్లు వచ్చాక ఆ ఇబ్బంది తప్పింది. పురుగుమందులూ ఆదా చేయవచ్చు. గతంలో కంటే 30 నుంచి 40% మేర తగ్గించి స్ప్రే చేసినా మంచి ఫలితాలు వస్తున్నట్లు తేలింది. పురుగు మందులు పిచికారీతో రైతులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా తప్పాయి.
" మాగాణుల్లో, నల్లరేగడి నేలల్లో పురుగుల మందులు చల్లాలంటే దిగబడేవి. ఒక్కోసారి రైతుల ప్రాణాల మీదకు కూడా వచ్చేది. జొన్న, మొక్కజొన్న పైరు పెరిగిన తర్వాత మందులు చల్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది.డ్రోన్ ద్వారా ఈ పనులు చాలా సులువుగా అయిపోతున్నాయి. " - హనుమయ్య, రైతు, గుంటూరు జిల్లా
" జామతోటకు మామూలుగా పిచికారి చేసినపుడు పైదాకా తోటకు పూర్తిగా చేయలేకపోయాం. డ్రోన్లతో కొమ్మ చివరి పూత వరకూ పురుగుల మందు పిచికారి చేయగలుగుతున్నాం."-వెంకట భాస్కరరావు, రైతు, ప.గో. జిల్లా
ఇదీ చదవండి :గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం.. మాట నిలబెట్టుకున్న సీఎం
Agriculture Drones: డ్రోన్లు వినియోగంలోకి తెచ్చేందుకు కొందరు ఔత్సాహికులు అంకుర సంస్థలు ఏర్పాటు చేశారు. వీరిలో ఎక్కువగా ఇంజినీరింగ్ చదివిన యువత ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఒడిదుడుకుల్ని చూసి ప్రత్యామ్నాయాలు ఆలోచించేవారు డ్రోన్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. మొదట్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. మరికొందరు విడిభాగాలు తెచ్చి ఇక్కడ డ్రోన్ల తయారీ మొదలుపెట్టారు. స్థానిక అవసరాలు గుర్తించి అందుకు తగ్గట్లుగా మార్పులు చేశారు. అలాగే కొన్ని పరికరాల్ని స్థానికంగా సమకూర్చుకున్నారు. బ్యాటరీలతో పాటు ఇంజిన్తో పనిచేసే డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు. వాటిని రైతుల పొలాల్లో పురుగుమందులు చల్లటానికి వినియోగిస్తున్నారు. దీనికిగాను ఎకరాకు ఇంతని వసూలు చేస్తున్నారు.
అంకుర సంస్థలు ఏర్పాటు చేసిన యువతకు ఇదో ఆదాయమార్గంగా మారింది. కొందరు ఎక్కువ డ్రోన్లు కొని భారీ స్థాయిలో వినియోగిస్తున్నారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదివిన వారికి డ్రోన్ పైలెట్లు, హెల్పర్లుగా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చినట్లయింది. పెద్దరైతులు సొంతగా డ్రోన్లు కొనుగోలు చేసి పొలాల్లో వినియోగిస్తున్నారు. ఏపీలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రోన్ల వాడకం ఎక్కువగా ఉంది. రాయలసీమ ప్రాంతంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ఒరవడి మొదలైంది. కర్నూలు, కడప జిల్లాల్లో కొందరు డ్రోన్లు అద్దెకు ఇవ్వటం ద్వారా ఆదాయం పొందుతున్నారు.