తెలంగాణ

telangana

ETV Bharat / state

హెరాయిన్​ రవాణా కట్టడికి అధికారుల పక్కా ప్లాన్.. వారిపై గట్టి నిఘా!

విదేశాల నుంచి అక్రమంగా సరఫరా అయ్యే హెరాయిన్​ను కట్టడి చేసేందుకు డీఆర్​ఐ అధికారులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టి.. ట్రాలీ బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలిస్తున్నారు. రెండేళ్లలో దాదాపు రూ.250 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 9, 2022, 1:15 PM IST

హెరాయిన్​ రవాణా కట్టడికి అధికారుల పక్కా ప్లాన్.. వారిపై గట్టి నిఘా..!
హెరాయిన్​ రవాణా కట్టడికి అధికారుల పక్కా ప్లాన్.. వారిపై గట్టి నిఘా..!

ఆఫ్రికా దేశాల నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్​కు ముఠాలు మాద కద్రవ్యాలు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నాయి. మరికొన్ని అంతర్జాతీయ ముఠాలు.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలకు హెరాయిన్ సరఫరా చేసేందుకు హైదరాబాద్​ను వారధిగా ఎంచుకుంటున్నాయి. కొన్ని దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు రవాణా అయ్యే ప్రతి వస్తువు మీద అనుమానం ఉంటుంది. ప్రయాణికులను అణువణువు తనిఖీ చేస్తారు. కానీ భారత్ నుంచి వెళ్లేవారిపై అంక్షలు కాస్త తక్కువ. దీన్ని అదునుగా చేసుకొని అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు.. హైదరాబాద్ మీదుగా ఇతర దేశాలకు హెరాయిన్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నాయి. మరికొన్ని ముఠాలైతే హైదరాబాద్​కు మాదకద్రవ్యాలు చేరవేసి.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజన్స్ అధికారులు నిఘా పెట్టి మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల ఆటకట్టిస్తున్నారు.

రెండేళ్లలో 35 కిలోల హెరాయిన్..: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సమాచార వ్యవస్థను పెంపొందించుకున్నారు. పలు రూపాల్లో తరలిస్తున్న హెరాయిన్​ను డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. రెండేళ్ల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయంలో 35 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఇందులో డీఆర్​ఐ 20.35 కిలోలు.. మిగతా 15 కిలోలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్​లో దాదాపు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా. డీఆర్ఐ అధికారులు 5 కేసులు నమోదు చేసి పలువురు విదేశీయులను అరెస్ట్ చేశారు. వీరిలో ఘనా, నైజీరియా, జాంబియా దేశాలకు చెందిన వాళ్లున్నారు. ఓ కేసులో 2.2 కిలోల హెరాయిన్ తరలిస్తున్న వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్షన్నర జరిమానా విధించింది. మిగతా కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి.

సూత్రదారుల జాడేది..: హెరాయిన్ తరలించే వ్యక్తులనే అరెస్టు చేస్తున్నారే తప్ప.. సూత్రదారులను గుర్తించలేకపోతున్నారు. అంతర్జాతీయ ముఠాలు.. ఆఫ్రికన్ దేశాలకు చెందిన నిరుపేదలకు డబ్బు ఆశ చూపి హెరాయిన్​ను హైదరాబాద్​కు చేరవేయాల్సిందిగా సూచిస్తున్నాయి. సరఫరా చేసే వ్యక్తి, తీసుకునే వ్యక్తి నిందితులకు తెలియకపోవడం గమనార్హం. నిర్దేశించిన ప్రాంతానికి హెరాయిన్ రాకపోతే... స్మగ్లర్లు విషయం పసిగట్టి తప్పించుకుంటున్నారు. హెరాయిన్ సరఫరా చేస్తూ దొరికిపోయిన విదేశీయులు జైళ్లలో మగ్గుతున్నారు. కేవలం హెరాయినే కాకుండా గంజాయి సరఫరాపైనా గట్టి నిఘా పెట్టారు. మూడేళ్లలో దాదాపు రూ.30 కోట్ల విలువైన 12 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి వచ్చే గంజాయిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details