ప్రస్తుతం అన్ని రంగాల్లో కృత్రిమమేధ కీలకంగా మారింది. డీఆర్డీవో పరిశోధనలు ఏ దశలో ఉన్నాయి?
కృత్రిమ మేధతో ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నేషన్) సాంకేతికతపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. శత్రువులు వేషం మార్చినా ఫేస్ రికగ్నేషన్ సాంకేతికత గుర్తిస్తుంది. దేశ భద్రత దృష్ట్యా ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. వేర్వేరు భాషలు మాట్లాడేటప్పుడు వాటంతట అవే తర్జుమా చేసేలా ‘లాంగ్వేజ్ ఆటోమేషన్’పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. తొలుత హిందీ, ఆంగ్లం, మరికొన్ని భాషలపై పనిచేస్తున్నాం. ఉదాహరణకు చైనీస్లో లైవ్లో మాట్లాడుతుంటే ఇంగ్లిష్లో వినొచ్చు. కొన్ని భాషలతో మొదలు పెట్టి ఎక్కువ భాషలకు ఈ సాంకేతికతను విస్తరించనున్నాం.
ప్రయోగశాలల విస్తరణ ప్రణాళికలు ఎలా సాగుతున్నాయి?
కొత్త ప్రయోగశాల ఏర్పాటు ప్రతిపాదనలేమీ లేవు. ఇప్పటికే ఉన్న వాటిని విస్తరిస్తున్నాం. ఇదివరకే స్థలం తీసుకున్న నాగార్జునసాగర్ ప్రాంతంలో హై ఆల్టిట్యూడ్ ఇంజిన్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. అత్యంత ఎత్తులోకి వెళ్లాక అక్కడ వేర్వేరు వాహకాల ఇంజిన్ పనితీరు ఎలా ఉంటుంది అనేది ముందే పరీక్షించేందుకు ఇది ఉపకరిస్తుంది. శామీర్పేటలోని అతిపెద్ద ప్రయోగశాలలో హైపర్సోనిక్ విండ్ టన్నెల్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. ఇక్కడే పర్యావరణ ప్రభావాలను అంచనా వేసేందుకు కొత్తగా పేలుడు టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.