తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజకీయాల్లో తన కుమార్తె తప్ప ఎవరూ కనపడకూడదనేది కేసీఆర్‌ ఉద్దేశం: డీకే అరుణ

DK Aruna Fires on CM KCR : రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నా.. సర్కార్‌ మిన్నకుండిపోతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. అధికార బీఆర్​ఎస్ నేతలు బరి తెగిస్తున్నారని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులు సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

By

Published : Mar 10, 2023, 9:36 PM IST

DK Aruna
DK Aruna

DK Aruna Fires on CM KCR : బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ పురుష నేతల నుంచే వేధింపులు ఎదురవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. అమ్మాయిలపై రాష్ట్రంలో నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నా.. సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ చేపట్టిన మహిళా గోస - బీజేపీ భరోసా దీక్ష ముగింపు సందర్భంగా కేసీఆర్​ సర్కారుపై డీకే అరుణ నిప్పులు చెరిగారు.

కేసీఆర్​కు మహిళలు అంటే చిన్న చూపు :బీఆర్​ఎస్​లో మహిళా ప్రజాప్రతినిధులు సొంతగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తన కుమార్తె తప్ప ఎవరూ కనపడకూడదనేది కేసీఆర్‌ ఉద్దేశమన్నారు. జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధించాడని భోరున ఏడ్చినా.. కేసీఆర్‌ ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు మహిళలు అంటే చిన్న చూపని ఆరోపించారు. బీఆర్​ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులకు సైతం గౌరవం లేదని విమర్శించారు. హన్మకొండ జిల్లా జానకిపురం సర్పంచ్ నవ్య స్థానిక ప్రజాప్రతినిధి తనను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు.

విచారణను తప్పించుకునేందుకే డ్రామాలు : మహిళలపై జరుగుతున్న ఘటనల్లో బీఆర్​ఎస్ నేతలు, వారి పిల్లల ప్రమేయం ఉంటుందని అరుణ మండిపడ్డారు. 119 అసెంబ్లీ సీట్లలో కేసీఆర్ కేవలం 4 సీట్లే మహిళలకు ఇచ్చారని విమర్శించారు. పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన కవిత.. మంత్రివర్గంలోకి మహిళలను ఎందుకు తీసుకోవడం లేదని.. తన తండ్రిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇస్తే.. దిల్లీలో ధర్నా చేపడుతానన్నందుకే నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తోందని ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణంలో ప్రమేయం లేకపోతే.. తప్పు చేయకపోతే భయం ఎందుకు అన్నారు. తెలంగాణకు కవితకు ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. విచారణను తప్పించుకునేందుకు, సానుభూతి పొందేందుకు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

కేటీఆర్ అధికారం శాశ్వతం కాదు : బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక ప్రధానిపైన, కేంద్ర ప్రభుత్వంపైన అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు. ప్రధాని ఛాయ్ అమ్మానని గర్వంగా చెప్పుకున్నారు.. దొంగ పాస్ పోర్ట్​ల దందా చేసినట్లు చెప్పగలవా కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు. విర్రవీగి మాట్లాడుతున్న కేటీఆర్ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లిక్కర్ స్కామ్​పై కాంగ్రెస్ నేతలు ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. కవిత మాత్రం సోనియాగాంధీని పొగుడుతుంటే.. ధర్నాకు పోకుండా కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.

'కేంద్ర పథకాల ప్రయోజనం రాష్ట్రంలో ప్రజలకు అందట్లేదు. ఒక వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే సీఎం స్పందించలేదు. మహిళలు అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదు. మహిళా ప్రజాప్రతినిధులు సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. రాష్ట్ర రాజకీయాల్లో తన కుమార్తె తప్ప ఎవరూ కనపడకూడదనేది కేసీఆర్‌ ఉద్దేశం. జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ను బీఆర్​ఎస్ ఎమ్మెల్యే వేధించారు. ఎమ్మెల్యే వేధించాడని ఎస్సీ మహిళా సర్పంచ్‌ ఇవాళే భోరున ఏడ్చింది.'-డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

మహిళలు అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదు: డీకే అరుణ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details