హుస్సేన్ సాగర్ శుద్ధి కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ పలు కార్యక్రమాలు చేపడుతోంది. రసాయన వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో గత ఎనిమిదేళ్లుగా మట్టి గణపతులను ప్రోత్సహిస్తోంది. సంప్రదాయ మట్టి విగ్రహాలను కుమ్మరి కుల వృత్తిదారులతో తయారు చేయించి స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా 50 వేల మట్టి గణపయ్యలను నగర ప్రజలకు పంపీణీ చేయాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. పంపిణీ కార్యక్రమాన్ని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ప్రారంభించనున్నారు.
విద్యావంతులకు ఉపాధి
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని వృత్తిదారులు విగ్రహాలను తయారు చేశారు. విగ్రహాల తయారీలో ఈ ఏడాది ఉన్నత విద్యావంతులు భాగస్వామ్యం కావడం విశేషం. ఒక్కో మట్టి గణపతి విగ్రహం తయారీకి 27.90 పైసల చొప్పున మొత్తం 13,95,000 రూపాయలను హెచ్ఎండీఏ చెల్లించనుంది. గ్రేటర్ పరిధిలో 31 హెచ్ఎండీఏ కేంద్రాల్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. అమీర్పేట్, కేబీఆర్ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి, శిల్పారామం, ఉప్పల్, దుర్గం చెరువుల ఆవరణలో వీటిని పంపిణీ చేయనున్నారు.
ఓ వైపు కరోనా ప్రభావం... మరోవైపు పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో భక్తులు మట్టి విగ్రహాల కోసం అన్వేషిస్తున్నారు. అలాంటి వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండానే మట్టి విగ్రహాలు పొందేందుకు హెచ్ఎండీఏ అధికారులు శ్రీకారం చుట్టారు.
ఇవీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గిన వరద నీటి తాకిడి!