ఏకీకృత డిజిటల్ సేవల పోర్టల్ ‘ధరణి’ని అక్టోబరు 3న ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా బాధ్యతలను ఒక సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ధరణి’ సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేశారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోర్టల్ నిర్వహణ, ఇతర శాఖలకు అనుసంధానంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు.
వీఆర్వోల సేవలు వినియోగించుకోండి
గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దయినప్పటికీ వారిని ఇంకా ఇతర శాఖలకు కేటాయించలేదు. వారికి ఇతర శాఖల్లో బాధ్యతలు అప్పగించే వరకు భూ సంబంధిత వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పథకాలు, సమాచార సేకరణకు వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. అప్పటివరకు వారి వేతనాలను రెవెన్యూశాఖ తరఫునే అందించాలని చెప్పినట్లు తెలిసింది.