Delhi CM Arvind Kejriwal to Meet CM KCR Today : దిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్ల విషయమై.. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కానున్నారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా రానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న కేజ్రీవాల్.. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనతో పాటు దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కూడా హైదరాబాద్ రానున్నారు.
అనంతరం సీఎం కేసీఆర్తో ఈ ఆర్డినెన్స్ గురించి సీఎం అరవింద్ కేజ్రీవాల్చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో కలిసి రావాలని కోరనున్నారు. ఈమేరకు దిల్లీ ప్రభుత్వం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం వచ్చింది. అందుకు తగిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయం చేరుకొని.. దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
Delhi CM Kejriwal To Meet CM KCR At Hyderabad : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జరుపుతున్న పోరాటానికి విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ల మద్దతు కోరారు. ఈ క్రమంలో శనివారం కేసీఆర్తో భేటీ అవ్వనున్నారు. దిల్లీలోని అధికారుల బదిలీ, పోస్టింగ్లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాగా.. దీని కోసం పార్లమెంటులో వ్యతిరేక గళం వినిపించాలని విపక్ష నేతల మద్దతును కేజ్రీవాల్ కోరుతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కూడా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి.. ఇలాంటి ఆర్డినెన్స్లు తీసుకువస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు.