ఏటా దోస్త్ నోటిఫికేషన్ వచ్చాకే డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టాలి. పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ముందస్తుగా సీట్లు నింపుకొంటున్నాయి. ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ రెండు రోజుల కిందటే విడుదల చేసింది. గురువారం నుంచి డిగ్రీలో ప్రవేశాలు తీసుకొనేందుకు నిర్ణయించింది. దీనికి విరుద్ధంగా ఇప్పటికే పలు డిగ్రీ కళాశాలలు ప్రవేశాలు తీసుకున్నాయి. అటు ఉన్నత విద్యామండలి గానీ, ఇటు ఉస్మానియా వర్సిటీ అధికారులు గానీ స్పందించడం లేదు.
హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల దోస్త్లో లేకపోవడంతో నేరుగా సీట్లు భర్తీ చేస్తోంది. బీఏ, బీకాం, బీబీఏ కోర్సులకు రూ.40 వేలకుపైగా వసూలు చేస్తోంది. విద్యార్థులు ప్రవేశాలు తీసుకొనేందుకు బారులు తీరడంతో యాజమాన్యం ‘క్యాష్’ చేసుకుంటోంది.
ఫీజులపై నియంత్రణేదీ..?
ఉస్మానియా పరిధిలో 430 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 370 దోస్త్ ద్వారా ప్రవేశాలు తీసుకుంటుండగా.. మరో 60 మాత్రం సొంతంగా ప్రవేశాలు తీసుకుంటున్నాయి. ఇవి దోస్త్ నోటిఫికేషన్ నుంచి మొదలుకొని ప్రవేశాలు తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా సీట్లు అయిపోతున్నాయంటూ మభ్యపెట్టి చేర్చుకుంటున్నాయి. ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. డిగ్రీలో కోర్సులను బట్టి రూ.15 వేల వరకు ఉంటుంది. కానీ రెట్టింపు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ పోర్టల్లో ఒకటి చూపించి, కళాశాలకు వెళ్లాక మరో ఫీజు చెబుతున్నాయి. కూకట్పల్లి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సీటుకు ఏడాదికి రూ.45 వేలు వసూలు చేస్తున్నారు. మరో డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ సీటు రూ.60 వేలు పలుకుతోంది.
దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్న విషయంపై ఉన్నత విద్యా మండలి, ఓయూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆయా కళాశాలల అనుమతులు రద్దు చేయాలి. ముందస్తుగా ప్రవేశాల కారణంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. గ్రామీణ విద్యార్థులకు ఆయా కళాశాలల్లో సీట్లు లభించే అవకాశం లేకుండాపోతోంది.
- ప్రేమ్కుమార్, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి
ఇదీచూడండి:సిటీలో హైటెక్ వ్యభిచారం.. నగ్నంగా వీడియో కాల్స్తో వలపు బాణం