తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆలయ భూముల లీజుల పున:సమీక్షకు ఇంద్రకరణ్ ఆదేశం' - దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌పై మంత్రుల సమీక్ష

ఆలయ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దశాబ్దాల నాటి లీజులను పున:సమీక్షించాలని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జంటనగరాల పరిధిలో దేవాలయ భూముల పరిరక్షణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, త‌లసాని శ్రీనివాస్ అధికారులతో సమావేశం జరిపారు.

Decades of leases temple lands to be reviewed in hyderabad area
'దశాబ్దాల నాటి ఆలయ భూముల లీజులను పున:సమీక్షించాలి'

By

Published : Jul 29, 2020, 5:54 PM IST

జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల ప‌రిర‌క్ష‌ణ‌పై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, త‌లసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు అవసరమైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామన్న ఇంద్రకరణ్ రెడ్డి... ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిరుప‌యోగంగా ఉన్న ఆల‌య భూముల‌ను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

లీజుల విషయంలో కఠినం

దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకుని.. తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్​లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లీజ్‌ నిబంధనలు మార్చి దేవాదాయ శాఖ‌కు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని చెప్పారు. దశాబ్దాల క్రితం నాటి లీజ్​ల‌తో పాటు అద్దెల విషయంలో కూడా పునఃసమీక్ష చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

లీగ‌ల్ ఆఫీస‌ర్ల‌ను కూడా

దీర్ఘ కాలంగా కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న‌ దేవాదాయ శాఖ భూములపై ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవ‌స‌రమైతే లీగ‌ల్ ఆఫీస‌ర్ల‌ను కూడా నియ‌మించాలని చెప్పారు. పోలీసుశాఖ స‌మ‌న్వ‌యంతో స్పెష‌ల్ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసి, భూ ఆక్ర‌మ‌దారుల‌ను ఖాళీ చేయించాలని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. హైద‌రాబాద్ ప‌రిధిలో నిరుప‌యోగంగా ఉన్న దేవాదాయ భూముల్లో 55 కోట్లతో 13 ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్​లు, క‌ల్యాణ మండ‌పాల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించినట్లు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెష‌ల్ డ్రైవ్ నిర్వహించి ‌1300 ఎక‌రాల ఆల‌య భూముల‌ను గుర్తించి వెనక్కి తీసుకోవడంతో పాటు 21 వేల ఎక‌రాల ఆల‌య భూముల‌కు ర‌క్ష‌ణ స‌రిహ‌ద్దు బోర్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి :పత్తి పంటపై మిడతల దండు దాడి

ABOUT THE AUTHOR

...view details