తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులే సైబర్ నేరగాళ్ల టార్గెట్.. అశ్లీల చిత్రాలతో బెదిరింపులు

సైబర్‌ నేరస్థులు పంథా మార్చారు. ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ ఐదో తరగతి విద్యార్థిని, ఉపాధ్యాయుడిని ఇదే తరహాలో బురిడీ కొట్టించారు.

By

Published : Mar 23, 2021, 11:56 AM IST

Cyber cheaters targeting online students and teachers
ఓటీపీలతో నగదు బదిలీ.. అశ్లీల చిత్రాలతో బెదిరింపులు

డెబిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఓఎల్‌ఎక్స్‌లో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరస్థులు తాజాగా పంథా మార్చారు. ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. మెట్రో నగరాలతో పాటు గోవా, కేరళ రాష్ట్రాల్లో సైబర్‌ నేరస్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఐదో తరగతి విద్యార్థినికి ఫోన్‌చేసి ఓటీపీలు చెప్పించుకుని ఆమె తండ్రి బ్యాంక్‌ఖాతా నుంచి రూ.32వేలు కొట్టేశారు. పశ్చిమ మండలంలోని ఓ విద్యాసంస్థలో ఆన్‌లైన్‌ పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడి వాట్సాప్‌ నంబర్‌ ద్వారా అశ్లీలచిత్రాలు పంపించారు. ఇలాంటి క్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు తెలిపారు.

40 పాఠశాలల ఫిర్యాదులు..

మార్చి తొలివారం నుంచి 15 రోజుల్లోనే నగరంలోని 40 పాఠశాలల నుంచి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదులొచ్చాయి. ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నప్పుడు 10 సెంకడ్ల నిడివి గల అశ్లీల వీడియోలు, అసభ్య చిత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని స్కూలు యాజమాన్యాలు వేర్వేరుగా ఫిర్యాదులు చేశాయి. ఆన్‌లైన్‌ తరగతుల వాట్సాప్‌ గ్రూప్‌లో అసభ్యకర చిత్రాన్ని పెట్టాడని సికింద్రాబాద్‌లోని ఓ విద్యాసంస్థ విద్యార్థిపై ఫిర్యాదు చేసింది. టీసీ ఇచ్చి పంపుతామంటూ తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. కంగారుపడిన సదరు విద్యార్థి తల్లిదండ్రులు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లాడికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. పోలీసులు విచారించగా.. ఆ విద్యార్థి వాట్సాప్‌ అకౌంట్‌ను సైబర్‌ నేరస్థులు హ్యాక్‌చేసినట్టు గుర్తించారు. విషయాన్ని విద్యాసంస్థ యాజమాన్యానికి వివరించి ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని సూచించారు.

డబ్బు కోసం బెదిరింపులు..

కొవిడ్‌-19 ప్రభావంతో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు జూన్‌లో అంతర్జాల బోధన మొదలైంది. ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న విద్యార్థుల నుంచి నగదు బదిలీ చేసుకోవచ్చని, అశ్లీల చిత్రాలు పంపించి డబ్బుకోసం బెదిరించవచ్చని సైబర్‌ నేరస్థులు గుర్తించారు. గతేడాది డిసెంబర్‌ నుంచి మోసాలు మొదలు పెట్టారు. బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ నగరాల్లోని ప్రముఖ విద్యాసంస్థల వివరాలు తెలుసుకుని విద్యార్థుల

ఫోన్‌నంబర్లు, వివరాలు సేకరించారు. విద్యాసంస్థల అధికారిక మెయిల్స్‌ హ్యాక్‌చేసి అందులో అసభ్యకరమైన వీడియోలు పోస్ట్‌చేసి రూ.లక్షల్లో నగదు కోసం బెదిరింపులు ప్రారంభించారు. అప్పటికప్పుడు మెయిల్‌ చిరునామాలు మార్చుకోలేని కొన్ని విద్యాసంస్థలు సైబర్‌ నేరస్థులు డిమాండ్‌ చేసిన సొమ్మును ఇచ్చేశాయి. కొన్ని యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

రవాణుల్లో ఆన్‌లైన్‌ తరగతులు వింటున్న విద్యార్థులు బోధన పూర్తయ్యేంత వరకు ఎవరు ఫోన్‌ చేసినా మాట్లాడకూడదు. తల్లిదండ్రులకు మరో ఫోన్‌ ఉంటే అవతలి వ్యక్తికి ఆ నంబర్‌ను పంపాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..

  • నాణ్యత బాగున్న ఫోన్​లేే కదా అని ఉపాధ్యాయులు చరవాణి ద్వారా బోధించకూడదు. బోధన జరుగుతున్నప్పుడే సైబర్‌ నేరస్థులు వాట్సాప్‌ సందేశాలు పంపిస్తారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు.
  • బోధన మధ్యలో ఉండగా.. అప్పుడప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారు? పాఠాలు వింటున్నారా? ఆటలాడుతున్నారా? ఉపాధ్యాయులు గమనించాలి. ఎందుకంటే సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్న వారికి అశ్లీల పాప్‌అప్‌లు పంపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details