తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 8:48 PM IST

ETV Bharat / state

ఉద్యాన పంటల సాగు పెరగాలి: నిరంజన్​ రెడ్డి

దేశంలో ఉద్యాన పంటల సాగు పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఉద్యాన పంటల సాగు విధానంపై నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ముంబయిలో మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజీ దగదుబూసే, ఉద్యాన శాఖ మంత్రి సందీపన్ రావు బుమ్రేతో భేటీ అయ్యారు.

Cultivation of horticultural crops should be increased: niranjan reddy
ఉద్యాన పంటల సాగు పెరగాలి: నిరంజన్​ రెడ్డి

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఉద్యాన పంటల సాగు విధానంపై నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ముంబయిలో మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజీ దగదుబూసే, ఉద్యాన శాఖ మంత్రి సందీపన్ రావు బుమ్రేతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నాథ్ దవాలే పాల్గొన్నారు. మహారాష్ట్రలో వానాకాలం, యాసంగిలో కలిపి 174.06 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు ఆ రాష్ట్ర మంత్రులు వివరించారు.

ప్రధానంగా 80 నుంచి 85 లక్షల హెక్టార్లలో పత్తి, సోయాబీన్.. మిగతా విస్తీర్ణంలో మామిడి, నారింజ, దానిమ్మ, ద్రాక్ష, పూలు వంటి ప్రధాన ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. 4 వేల కోట్ల రూపాయల వ్యయంతో వివిధ రకాల పథకాలు వ్యవసాయ రంగ ప్రోత్సాహం కోసం అమలు చేస్తున్నామంటూ ఆ పథకాలను తెలంగాణ బృందానికి వివరించారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు, నిర్దేశిత సాగు విధానంపై మహారాష్ట్ర మంత్రులు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో తీగజాతుల కూరగాయలు, పందిరి-పెండల్ సాగు పద్ధతిని అభినందించారు.

ఉద్యాన పంటల సాగుతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తులు సాధించి రాష్ట్ర స్థూల ఆదాయం పెంచే అవకాశం ఉందని నిరంజన్​ రెడ్డి అన్నారు. తెలంగాణలో కూడా ఉద్యాన పంటల సాగు రకాలను విస్తరించి పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ రైతులు పంట సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకానికి స్వస్థిచెప్పి శాస్త్రీయ పద్ధతి పాటించాలన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు సంబంధించి తెలంగాణ ప్రణాళికపై నిరంజన్​ వివరించగా... తాము కూడా పామాయిల్‌ సాగు చేపట్టాలని యోచిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి చూపిన మహారాష్ట్ర మంత్రులు.. త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్‌ఫామ్ క్షేత్రాలను సందర్శిస్తామని వెల్లడించారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా వినూత్న పద్ధతుల్లో సాగుకు పెద్దపీట వేయడం హర్షణీయమని... ముఖ్యమంత్రి కేసీఆర్ సేద్యంపై చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. అంతకుముందు తాలెగావ్ ఎంఐడీసీలో 500 ఎకరాల ఫ్లోరికల్చర్ పార్క్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించారు. 110 ప్లాట్లుగా విభజించి వివిధ రకాల పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్న విధానాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి:దేశంలో ప్రధాన టెక్​ హబ్​గా హైదరాబాద్​ అవతరించింది: మంత్రి కేటీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details