తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిపేలా చర్యలు తీసుకోవాలి' - SEC nimmagadda ramesh kumar video conference on local polls

పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా జరిపేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని.. ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై.. ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. అవసరమైతే కేంద్ర బలగాలను రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

'ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిపేలా చర్యలు తీసుకోవాలి'
'ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిపేలా చర్యలు తీసుకోవాలి'

By

Published : Jan 27, 2021, 6:56 PM IST

ఏపీలో శుక్రవారం నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తొలి విడతలో విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లు, 173 మండలాల పరిధిలో పంచాయతీల్లో వార్డు మెంబర్లు, సర్పంచి, ఉప సర్పంచి ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా .. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పాల్గొన్న ఉన్నతాధికారులు

ఎస్​ఈసీ కార్యాలయం నుంచి జరిగిన సమావేశంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్ హాజరయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సింఘాల్, రాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీ రవి శంకర్ అయ్యర్, ఐజీ సంజయ్ కుమార్, ఎస్​ఎస్ రావత్, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణ, భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై.. అధికారులకు ఎస్​ఈసీ దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలతో పాటు వ్యాక్సినేషన్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏకగ్రీవాలు జరిగే క్రమంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం నుంచి తొలి దఫా ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారుల నియామకం, పంచాయతీల్లో ఓటరు జాబితా ప్రదర్శన చేయాలని సూచించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దాడులు, దౌర్జన్యాలు, అపహరణ, బెదిరింపులు జరిగే ప్రమాదం ఉందని అందరూ అప్రమత్తంగా ఉంటూ నివారించాలని ఆదేశించారు.

పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయనున్నాం: డీజీపీ

సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సమావేశం అనంతరం డీజీపీ తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: సీఎస్

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని.. ఎస్​ఈసీ సహా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే కేంద్ర బలగాలు, సిబ్బందిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:పీఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details