తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2020, 8:00 AM IST

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం.. వైరస్​తో పోరాడుతున్న బాధితుల ఆవేదన

'నాన్నా. చాలా దాహంగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది.నా పరిస్థితి చేయి దాటిపోతోంది. అది నాకు అర్థమవుతూనే ఉంది. ఇక మీరు ఇంటికి వెళ్లండి నాన్నా.. అమ్మ జాగ్రత్త' అంటూ చెప్పిన కొన్ని గంటలకే ఆ వ్యక్తి కన్ను మూసిన విషాదమిది. ఊపిరి నిలబెట్టుకోవడానికి వారం రోజుల్లో ఆరు ఆసుపత్రులు తిరిగిన ఆ అభాగ్యుడు చివరికి కరోనా రక్కసికి బలయ్యారు.

covid virus victims facing problems in treatment
వైద్యుల నిర్లక్ష్యం.. వైరస్​తో పోరాడుతున్న బాధితుల ఆవేదన

హైదరాబాద్‌ మల్లాపూర్‌ ప్రాంతానికి చెందినవ్యక్తి (40) కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. జ్వరం, దగ్గుతో జులై 1న మల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. 3న జ్వరం, దగ్గుతోపాటు ఆయాసం పెరగడంతో నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రికి కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారు. ఆధార్‌ కార్డు తీసుకురావాలని వెనక్కు పంపారు. మరునాడు వెళ్లగా రోజుకు 50 మందికే పరీక్షలు చేస్తున్నామని చెప్పడంతో వెనుదిరిగారు.

కరోనా పరీక్షలు చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కుటుంబసభ్యుల ఎదుట ఆ వ్యక్తి వాపోయారు. ఈ క్రమంలో 6న సికింద్రాబాద్‌లోని మూడు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లగా.. పడకలు లేవంటూ వెనక్కి పంపించారు. అదేరోజు సాయంత్రం ఎల్‌బీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు ఉదయం ఐసీయూకు తరలించాలని వైద్యులు చెప్పారు. మరో రెండు గంటల తర్వాత ఆక్సిజన్‌ సౌకర్యం లేదు.. వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. అప్పటికే బాధితుడి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపారు.

మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమై మరణించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు కేవలం తండ్రి, మరొక బంధువుకు.. మృతుడికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. అప్పటికే మొత్తం ఫీజులు వసూలు చేశారు. బుధవారం మధ్యాహ్నం నాచారం పోలీసుల పర్యవేక్షణలో ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ తర్వాత తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ అధికారులకు గానీ, వైద్యాధికారులకు కరోనాతో మృతి చెందిన సమాచారం లేకపోవడం గమనార్హం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details