కరోనా రెండో వేవ్ ఊహించిన దాని కంటే వేగంగా విజృంభించింది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో రాష్ట్రంపై మహమ్మారి ముప్పేటదాడి చేసింది. వందల నుంచి నిత్యం వేలాది మంది మహమ్మారి భారినపడ్డారు. ఏప్రిల్లో ఒకేరోజు పదివేల మందికి పైగా కొవిడ్ సోకింది. ఆస్పత్రుల్లో పడకలు సైతం క్రమంగా నిండుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బాధితులకు పడకలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఇటీవల రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల్లో పాజిటివ్ రేటు దాదాపు రెండు శాతం వరకు తగ్గటమే ఇందుకు నిదర్శనం. మే 1న రాష్ట్రంలో సుమారు 10శాతానికి పైగా ఉన్న కరోనా పాజిటివ్ రేటు ప్రస్తుతం 8.08శాతానికి తగ్గిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
రికవరీ రేటు పెరగడం గమనార్హం
మే 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 76,330 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... 71,678 మందికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అందులో 4,370 మందికి వైరస్ నిర్ధరణ అయిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంటే 10.36 శాతం మందికి వైరస్ సోకింది. రికవరీ రేటు సైతం 81.57శాతంగా నమోదైంది. మరణాలు 0.52 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ నివేదికలు తెలిపాయి. మే 2న నాటికి పాజిటివ్ రేటులో స్పల్ప పెరుగుదల నమోదైంది. 10.39 శాతం మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. రికవరీ రేటు సైతం 81.91శాతానికి పెరిగింది. మే 3న 10.24 శాతం పాజిటివ్ రేటు.. 82.3 శాతం రికవరీ రేటు నమోదైందని ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది.