తెలంగాణ

telangana

డేంజరస్: కాలకుండానే వదిలేస్తున్నారు... ప్రజలు వణికిపోతున్నారు!

By

Published : Jul 5, 2020, 7:02 AM IST

మానవ జీవితాలను కరోనా అతలాకుతలం చేస్తోంది. దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి సోకి ప్రాణం పోతే.. మృతదేహాన్ని కనీసం చూసేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం లేని దుస్థితి. ఇది చాలదన్నట్లు కరోనాతో చనిపోతే మృతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తున్నారు. సగం కాలిన మృతదేహం శరీర భాగాలను కుక్కలు పీక్కు తింటున్న అమానవీయ ఘటన హైదరాబాద్‌ ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో చోటుచేసుకుంది.

corona
corona

గాంధీ ఆసుపత్రిలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనం చేస్తున్నారు. మృతుల వివరాల నమోదు, అంత్యక్రియల పర్యవేక్షణకు జీహెచ్‌ఎంసీ ముగ్గురు సిబ్బందిని అక్కడ నియమించింది.

అయితే మృతదేహాలు పూర్తిగా కాలకుండా వదిలేస్తుండటం కలకలం సృష్టిస్తోంది. శనివారం తన తాత అస్థికల కోసం శ్మశానవాటికకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటంతో అవాక్కయ్యారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్‌ అయ్యాయి.

వాళ్లపై వీళ్లు.. వీళ్లపై వాళ్లు

కరోనా మృతుల దహన కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ సిబ్బందే పర్యవేక్షిస్తుంటారని శ్మశానవాటిక ఇన్‌ఛార్జి గోపాలకృష్ణ సమాధానమిచ్చారు. మృతదేహాలు పూర్తిగా కాలే వరకు చూడాల్సిన బాధ్యత శ్మశానవాటిక నిర్వాహకులదేనని ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ భార్గవ నారాయణ వివరణ ఇవ్వడం గమనార్హం.

ఇదీ చదవండి:విజృంభిస్తున్న కరోనా... తల్లడిల్లుతున్న తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details