తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2020, 8:52 AM IST

ETV Bharat / state

జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా

కరోనా వైరస్‌ విస్తరణ, లాక్‌డౌన్‌ ఆంక్షలతో దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావలసిన పరిస్థితి. దీని వల్ల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులేమిటి, అలవాట్లు- ప్రాధమ్యాలు ఏమైనా మారాయా? అనే పరిశీలన చేపట్టినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘నీల్సన్‌’ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

Corona that brought about lifestyle changes
జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా

బయట భోజనాలు చేసేవారు కాస్తా ఇప్పుడు పూర్తిగా ఇంటి భోజనానికి పరిమితం అయ్యారు. పరిశుభ్రత పెరిగింది. అందం మీద ఆసక్తి అధికం అయింది. దీనికి సంబంధించిన వస్తువుల అమ్మకాలు పెరిగినట్లు నీల్సన్‌ విశ్లేషించింది. ఈ నేపధ్యంలో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించింది. దీని ప్రకారం..

అనిశ్చితికి సిద్ధమవుతున్నారు...

‘కరోనా’తో ఉద్యోగాలు, జీతభత్యాల్లో కోత, వ్యాపార సంస్థలు మూతబడిపోవటంతో ప్రజల్లో అభద్రత ఏర్పడింది. దీంతో ఎక్కువ మంది తీవ్రమైన ఒత్తిడికి లోనుకావటం, మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఇంతకంటే కష్టం కాలం ఎదురయితే ఎలా? అనే సందేహం ఏర్పడింది. ఫలితంగా ముందు జాగ్రత్త పెరిగింది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం, తప్పనిసరి అయితేనే ఖర్చు పెట్టటం వంటి అలవాట్లు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఆరోగ్యంపై దృష్టి సారించటం, వ్యాయామం చేయటం కనిపిస్తోంది.

పరిశుభ్రత, రోగ నిరోధక శక్తి పెంచుకునే దిశగా..

‘కరోనా’ భయంతో ప్రజల్లో పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచన వచ్చి అదే అలవాటుగా మారింది. ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, బట్టలు, ఇతర వస్తువులను శుభ్రంగా పెట్టుకోవటం... సాధారణ చర్యలు అయ్యాయి. ఈ అలవాట్లు భవిష్యత్తులోనూ దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల లిక్విడ్‌ సోప్‌లు, రోగ నిరోధక శక్తిని పెంపొందించే మందులు, ఇతర సాధ నాలకు గిరాకీ పెరిగిపోయింది. చవన్‌ప్రాశ్‌, తేనె వాడకం అధికం అయింది.

దూరం... దూరం...

ప్రజలు గతంలో మాదిరిగా ఒకరికొకరు దగ్గరగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ‘సామాజిక దూరం’ పాటించటం అనేది సాధారణ చర్యగా మారింది. నగరాల్లోని ప్రజలు ఏమైనా వస్తువులు కావాలంటే ‘హోమ్‌ డెలివరీ’ తెప్పించుకుంటున్నారు. ఇ-కామర్స్‌ పోర్టళ్లలో తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటే అవి ఇంటికే వస్తున్నాయి. ప్రయాణాలు దాదాపు మానుకున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు వచ్చే ఆరు నెలల పాటు దూర ప్రయాణాలు చేసేదే లేదని స్పష్టం చేశారు.

సొంత వంట... ఇంటి భోజనం...

చాలా మందికి బయట భోజనం చేసే అవకాశం లేదు. ఉన్నా దొరికేది తక్కువ. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత వంట, ఇంటి భోజనానికి అలవాటు పడ్డారు. భవిష్యత్తులోనూ ఇదే అలవాటు కొనసాగుతుందని, తద్వారా ప్రజల ఆహారపు అలవాట్లు మారినట్లు అవుతుందని స్పష్టం అవుతోంది.

స్వదేశీ మోజు!

గతంలో జై జవాన్‌- జై కిసాన్‌, హరిత విప్లవం, వంటి సామాజిక ఉద్యమాలు ప్రజా జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. కొవిడ్‌-19 ఫలితంగా స్వదేశీ మోజు ప్రజల్లో పెరుగుతున్నట్లు ఈ సర్వేలో స్పష్టమైంది. మన వాడే వస్తువుల్లో మెజార్టీ మనదేశంలోనే తయారు కావాలనే అభిలాష ప్రజల్లో ఏర్పడుతోంది. అదేవిధంగా ఆయుర్వేద వైద్యం మీద, సహజ సిద్ధమైన వస్తువుల మీద ఆసక్తి పెరిగింది.

నెమ్మదిగా కోలుకుంటోంది...

ఆర్థిక వ్యవస్థ, వ్యాపార రంగాల తీరుతెన్నులను ఈ సర్వే పరిశీలించింది. చైనా, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్‌ దేశాలతో పోల్చితే మనదేశంలో ఆర్థికంగా కోలుకోవటం నిదానంగా ఉన్నట్లు పేర్కొంది.ఆహార తయారీ, ప్రాసెసింగ్‌ రంగం దాదాపు కోలుకొని కరోనా ముందు కాలం నాటి స్థితికి చేరుకున్నట్లు పేర్కొంది. ప్రజలు అందచందాలకు ప్రాధాన్యం ఇవ్వటం పెరిగినట్లు, దీనికి సంబంధించిన వస్తూత్పత్తులకు గిరాకీ అధికంగా ఉన్నట్లు వివరించింది. కానీ మిగతా రంగాలు ఇంకా అందిపుచ్చుకోవలసి ఉంది. ఆర్థికంగా కోలుకోవటం అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలైనట్లు వివరించింది.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details