తెలంగాణ

telangana

కరోనా మహమ్మారి నుంచి ఊరట

By

Published : Apr 29, 2020, 4:57 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్​తోపాటు శివారు ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం కొంత ఊరట కలిగిస్తోంది. మంగళవారం నగరంలో కేవలం ఆరు కేసులే నమోదయ్యాయి. నిలోఫర్‌ ఆస్పత్రికి చెందిన ఓ నర్సుకు కరోనా సోకింది. కుషాయిగూడ ప్రాంతంలో ఓ వ్యాపారికి పాజిటివ్‌ వచ్చింది. గాంధీ నుంచి మంగళవారం 42 మందిని డిశ్ఛార్జి చేశారు.

corona positive cases decreases at Hyderabad latest news
corona positive cases decreases at Hyderabad latest news

స్వీయ క్వారంటైన్‌లో ఉన్న ఓ నర్సుకు తాజాగా పాజిటివ్‌ రావడం వల్ల ఆమె పనిచేసే నిలోఫర్‌ ఆసుపత్రిలో అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజుల క్రితం మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన రెండు నెలల పాపకు ‘నిలోఫర్‌’లో పరీక్షలు చేయగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్డులో పని చేసిన వారిని పరీక్షలు చేసి స్వీయ క్వారంటైన్‌లో ఉంచారు. అందులో ఈ నర్సు ఉంది. ఆమెను రెండో సారి పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది.

* ఈనెల 24న ఫలక్‌నుమా నుంచి జ్వరంతో బాధపడుతున్న నాలుగేళ్ల బాబుని ‘నిలోఫర్‌’కు తరలించారు. పరీక్షించగా సోమవారం రాత్రి ‘కరోనా పాజిటివ్‌’గా రిపోర్టు వచ్చింది.

* నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో అద్దెకుంటున్న అంబులెన్స్‌ డ్రైవర్‌(28)కు కరోనా సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఇప్పటికే గాంధీలో చికిత్స పొందుతున్నారు.

* చర్లపల్లి డివిజన్‌లోని ఓ కాలనీకి చెందిన కిరాణ టోకు వర్తకుడు(65)కి మంగళవారం కరోనా సోకిందని నిర్ధారించారు. ఇతను 15రోజులుగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు.

పలువురు అనుమానితులు...

క్యాన్సర్‌తో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ(44)కు ఇతర సమస్యలు తలెత్తడం వల్ల కరోనాగా అనుమానించి వైద్యులు గాంధీ ఆసుపత్రికి పంపారు. కరోనా అనుమానిత లక్షణాలతో మంగళవారం ఫీవరాసుపత్రిలో 12 మంది, ఛాతీ ఆసుపత్రిలో అయిదుగురు చేరారు.

కోలుకుంటున్న శివారు ప్రాంతాలు...

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా పొద్దటూరుకు చెందిన ఓ మహిళకు కరోనా రావడం, ఆమె రెండు రోజుల కిందటే గ్రామానికి వచ్చివెళ్లడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు జిల్లాల్లో జీహెచ్‌ఎంసీ పరిధి కాని ప్రాంతంలో 43 కేసులు రాగా.. ఇప్పటివరకు 19 మంది కోలుకున్నారు. ముగ్గురు చనిపోయారు. వీరు అప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే. మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగాఉందని, త్వరలోనే డిశ్ఛార్జి అవుతారని అధికారులు చెబుతున్నారు.

క్వారంటైన్‌లు ఖాళీ...

కేసులు తగ్గుముఖం పడుతుండడం వల్ల క్వారంటైన్లలో కరోనా లక్షణాలు లేనివారిని ఇళ్లకు తరలించారు. సోమవారం రాత్రే సమాచారం ఇవ్వడం వల్ల క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్నవారు వెళ్లిపోయారు. కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారిని నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, టిబ్బిఖానాల్లో ఉంచారు. వీరిలో 500మందికి పైగా నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి 167 మంది, టిబ్బిఖానా నుంచి 250 మంది సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఇళ్లకు వెళ్లారు. నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి నుంచి వంద మంది డిశ్ఛార్జి కావడం వల్ల ప్రభుత్వ క్వారంటైన్లు ఖాళీ అయ్యాయి. వైద్యుల సూచనల మేరకు వారిళ్లకు వెళ్లి 28 రోజుల పాటు ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details