ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో లక్షా 424 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 17,188 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్తో మరో 73 మంది మరణించారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 11 మంది చనిపోయారు. విశాఖలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున... నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు.. అనంతపురంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు విడిచారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,260 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,86,695 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికారులకు కరోనా...
విశాఖ కలెక్టర్ వినయ్చంద్ కొవిడ్ బారినపడ్డారు. జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, సంయుక్త కలెక్టర్లు సహా పలువురు అధికారులు కరోనాతో బాధపడుతుండటంతో... ఇంటి వద్ద నుంచే సమీక్షలు, విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో ఓ న్యూస్ఛానెల్ రిపోర్టర్గా పనిచేస్తున్న మారుతిరెడ్డి.. కరోనాతో పోరాడి ప్రాణం వదిలారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో వాలంటీర్గా పనిచేస్తున్న అనిత... చికిత్స పొందుతూ మరణించారు. కడప జిల్లా మైదుకూరులో బిచ్చగాడు మృతదేహానికి.. వివేకానంద ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించింది. గుంటూరు జిల్లా నండూరులో కరోనాతో మృతిచెందిన వ్యక్తికి...పొన్నూరు ముస్లిం యూత్ సభ్యులు.. హిందూ సంప్రదాయపద్ధతిలో అంతిమసంస్కారాలు పూర్తిచేశారు.
నేలపైనే చికిత్స
కాకినాడ జీజీహెచ్లో పడకల కొరతతో నేలపైనే రోగులకు చికిత్స చేశారు. కడప జిల్లాలోనూ పడకల కొరత వేధిస్తోంది. రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నా...పడకల సంఖ్య పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా సర్వజన వైద్యశాలలో పడకల కొరతతో కొంత మందిని నేలపై పడుకోబెట్టి వైద్యం చేశారు. కల్యాణదుర్గంలో అన్ని పడకలకూ ఒకే ఆక్సిజన్ యంత్రం ఉన్నందున...ప్రాణవాయువు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు వాపోయారు.