* భార్యాభర్తలిద్దరూ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. సూపరింటెండెంట్ పేషీతోపాటు, వేర్వేరు విభాగాల్లో వీరు నిత్యం విధుల్లో ఉంటారు. గతంలో వీరి అపార్ట్మెంట్లో వైద్య వృత్తిలో ఉన్నందుకు ఎంతో గౌరవం దక్కేది. కరోనా తర్వాత పరిస్థితి మారింది. వారి మాటల్లో మార్పు వచ్చింది. ఇల్లు ఖాళీ చేయమని ఒత్తిడులు వచ్చాయి. అయితే వారు బెదిరిపోలేదు. ధైర్యంగా నిలబడ్డారు. ఇది తమ వృత్తి ధర్మమని వారికి వివరించారు. వినకపోతే చట్టపరంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పడం వల్ల... క్రమేపీ అర్థం చేసుకున్నారు.
* యాదాద్రి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా తగ్గే వరకు ఊరికి రావద్దంటూ ఏకంగా ఆ ఊరి పెద్ద ఒకరు హుకుం జారీ చేశాడు. అయినా ఆ సెక్యూరిటీ గార్డు తన ఉద్యోగం మానేయలేదు. మరింత బాధ్యతగా తన విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా కట్టడిలో తన పాత్ర పోషిస్తున్నాడు.
* నగర శివారులో ఉంటున్న నాలుగో తరగతి ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైతే తొలుత ఓపికగా వివరించే ప్రయత్నం చేశాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పినా సరే స్థానికుల్లో మార్పు రాకపోవడం వల్ల చివరికి పోలీసులను ఆశ్రయించారు. వారు రంగంలోకి దిగి సర్దిచెప్పారు.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో పక్కన ఉన్నవాడు చిన్నగా దగ్గితే భయపడే పరిస్థితి. అలాంటిది కరోనా బాధితులకు చికిత్స అందించే ఓ పెద్ద ఆసుపత్రిలో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు. తీరా తాము ఉంటున్న ప్రాంతాల్లో స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా భయపడేది లేదని.. తమకు ఉద్యోగ ధర్మమే ముఖ్యమని ముందుకు సాగుతున్నారు. కుటుంబ సభ్యులు.. ఇంట్లో పిల్లలను తలచుకుంటే మనసులో కొంత భయం వెంటాడుతున్నా సరే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విధుల్లో కీలకంగా ఉంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం.. రక్షణ.. పరిశుభ్రత.. తదితర పనుల్లో నిరంతరం దాదాపు 400 మంది కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు.