తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 7:54 AM IST

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: వేల సంఖ్యలో వివాహాలు వాయిదా

కరోనా దెబ్బకు పెళ్లిళ్ల వేడుకల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వివాహం అంటే ఇంటి నిండా బంధువులు, పండగలా జరిగే వేడుక, ఇప్పుడు కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిడారంబరంగా జరిపించేస్తున్నారు. వివాహాల ఏర్పాటుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసే ఈ రోజుల్లో, లాక్​డౌన్ కారణంగా అన్నీ మూతపడిపోయాయి. దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఆర్థిక కష్టాలు పడుతున్నారు.

corona-effect-on-marriages
కరోనా ఎఫెక్ట్​: వేల సంఖ్యలో వివాహాలు వాయిదా

వందల సంఖ్యలో అతిథులు.. ఆత్మీయ ఆలింగనాలు.. విందులు.. వినోదాలు.. విద్యుద్దీపాల వెలుగులు.. సినిమా సెట్టింగుల్లా మండపాలు.. మెహందీ ఫంక్షన్‌లు, సంగీత్‌లు, బారాత్‌లు.. మార్చి 22 వరకు పెళ్లిళ్లు జరిగిన తీరిది.
వరుడు, వధువు.. కుటుంబసభ్యులు.. మరీ ముఖ్యమైన బంధుమిత్రులు.. రెండు చుక్కల శానిటైజర్‌.. ఒక మాస్క్‌.. ఇంటి ఆవరణో... చిన్న వేదికో.. అంతే! ..ఇదీ కరోనా దెబ్బకు మారిన పెళ్లి స్వరూపం.

ఆంధ్రప్రదేశ్​లో ఏప్రిల్‌, మే నెలల్లో వేల వివాహాలు జరగాలి. కానీ లాక్‌డౌన్‌ దెబ్బకు 90 శాతం వాయిదా పడ్డాయి. ముహూర్తం మార్చకూడదనుకున్నవారు.. హంగూ, ఆర్భాటం లేకుండా జరిపించేశారు. వివాహాలకు ఏర్పాట్లు చేయడం ఒక పరిశ్రమలా మారిపోయిన ఈ రోజుల్లో... దానిపై ఆధారపడిన వేల మంది ఉపాధి కోల్పోయారు.

ఆగస్టు నుంచి ముహూర్తాలు

ఏప్రిల్‌, మే 13, 14 తేదీల్లో గట్టి ముహూర్తాలు ఉన్నాయి. ఆ సమయంలో అన్నవరం వంటి దేవాలయాల్లో వేల పెళ్లిళ్లు జరగాల్సి ఉందని అంచనా. కరోనాతో అవన్నీ వాయిదా పడ్డాయి. వీరితోపాటు, కొత్తగా ముహూర్తాలు పెట్టుకోవాలనుకున్నవారికి ఆగస్టు వరకు అవకాశాలు లేవని పురోహితులు చెబుతున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు నెలాఖరు ముహూర్తాలున్నాయని, అప్పుడు పెళ్లిళ్లు చేసుకోవాలని చాలా మంది వేచిచూస్తున్నారు.

గణనీయంగా తగ్గనున్న ఖర్చు

పెళ్లిళ్లు ఆడంబరంగా చేయడం ఇటీవల పెరిగిపోయింది. స్థోమతని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. కొందరు మొత్తం బాధ్యతల్ని ఈవెంట్‌ మేనేజర్లకు అప్పగిస్తున్నారు. కరోనా దెబ్బకు అన్ని రకాల వివాహాల ఖర్చు గణనీయంగా తగ్గనుంది. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌ సడలించినా... ఒకే చోట ఎక్కువ మంది గుమికూడే పరిస్థితులు ఉండకపోవచ్చు! ఈ మేరకు ప్రభుత్వ ఆంక్షలూ కొనసాగే అవకాశముంది. దీంతో రూ.20 లక్షలు ఖర్చు పెట్టాలనుకున్నవారు, రూ.5 లక్షల్లోనే పెళ్లి కానిచ్చే అవకాశముంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు అక్కడివారితోనే సంబంధాలు కుదుర్చుకున్నా, బంధుమిత్రులంతా ఉంటారని ఇక్కడికి వచ్చి వివాహాలు చేసుకునేవారు. ఇప్పుడు అక్కడే సాదాసీదాగా కల్యాణం చేసుకుంటున్నారు. విదేశాల్లో స్థిరపడిన వారితో సంబంధాలు కదుర్చుకున్న ఇక్కడివారు.... రాకపోకలు నిలిచిపోవడంతో వివాహాలు వాయిదా వేసుకున్నారు.

రాబోయే మార్పులు ఇవీ..!

* 10 వేల చదరపు అడుగుల వైశాల్యం గల హాల్‌లో ఇది వరకు ఒక్కో వ్యక్తికి 4-6 చ.అడుగులు కేటాయించేవారు. కుర్చీకి కుర్చీకి మధ్య అంగుళం గ్యాప్‌ ఉండేది కాదు. వ్యక్తిగత దూరం పాటించాలి కాబట్టి ప్రస్తుతం ఇంత మందిని కూర్చొబెట్టడం సాధ్యంకాదు.
* అతిథులు దూరం నుంచే అక్షింతలు వేసి వెళ్లిపోతారు. కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు చెప్పడాలు ఉండకపోవచ్చు.

ఎవరిపై ప్రభావం?

* విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో 250-300 మంది వరకు రిజిస్టర్డ్‌ ఈవెంట్‌ మేనేజర్లు ఉన్నారు.వీరి వ్యాపారం దెబ్బతింటుంది.
* 300 కంటే ఎక్కువ మంది పట్టే, ఏసీ ఫంక్షన్‌ హాళ్లు 1500 వరకు ఉన్నాయి. 300 మందికంటే తక్కువ పట్టేవి మరో ఐదు వేలు, 10 వేల చ.అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్నవి 100-120 వరకు ఉంటాయి. వీటిపై ప్రభావం తప్పదు.
* మండపాలు అలంకరించేవారు, విద్యుద్దీపాలంకరణ చేసేవారు... పురోహితులు, బ్యాండ్‌, సన్నాయి మేళం వాయించేవారు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్‌ సిబ్బంది... ఇలా చాలా మంది ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇదీ చదవండి:రేపటి నుంచే లాక్​డౌన్​ 4.0- ఆంక్షలపై సర్వత్రా ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details