తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2020, 5:24 AM IST

Updated : Mar 23, 2020, 7:26 AM IST

ETV Bharat / state

27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన ఆరుగురికి కరోనా ఉన్నట్లు ఆదివారం నిర్ధరణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కరోనా వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈనెల 31 వరకు రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల వారు రాకుండా సరిహద్దును మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

corona cases in telangana reached to 27 government moving towards serious action
27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు

27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు

రాష్ట్రంలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 26లో కేవలం ఒక్కటి మాత్రమే... ఇప్పటికే పాజిటివ్​ వచ్చిన వారి నుంచి వ్యాప్తి చెందింది. ఇదే... రాష్ట్రంలో నమోదైన మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు కావటం గమనార్హం.

ఇద్దరు ఏపీకి చెందిన వారు..

ఆదివారం కరోనా సోకిన ఆరుగురిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్​కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరు లండన్ నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్ వచ్చిన గుంటూరు యువకుడు కాగా, మరొకరు రాజోలుకు చెందిన 26 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఇతను స్వీడన్ నుంచి విమానంలో హైదరాబాద్​కు వచ్చినట్లు తెలిపారు.

వీరితో పాటు కరోనా పాజిటివ్​ వచ్చినవారిలో హైదరాబాద్​కు చెందిన 23 ఏళ్ల యువకుడు.. లండన్ నుంచి దోహా మీదుగా నగరానికి చేరుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన వ్యక్తి ఈనెల 14న స్వీడన్ నుంచి హైదరాబాద్​కు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువకుడు లండన్ నుంచి నగరానికి చేరుకున్నాడు. దుబాయ్​ నుంచి భాగ్యనగరానికి వచ్చిన 50 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు.

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలోనే కరోనా లక్షణాలు బయట పడుతుండడం వల్ల ఈనెల 31 వరకు రాష్ట్ర సరిహద్దులను ప్రభుత్వం మూసివేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్​. విదేశాల నుంచి వారు తమ వివరాలను స్థానిక అధికారులకు అందించాలని సూచించారు.

ప్రభుత్వ చర్యలతో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారి సంఖ్య భారీగా తగ్గిపోనుంది. రాష్ట్రంలో ఈనెల 31 వరకు లాక్​డౌన్​ ప్రకటించడం వల్ల ప్రజలు గుంపులుగా బయటకు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవీచూడండి:దేశంలో 396కు చేరిన కరోనా కేసులు

Last Updated : Mar 23, 2020, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details