తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. డీసీసీ అధ్యక్షులతో రాష్ట్ర నాయకత్వం సమావేశమై పార్టీ బలోపెతంపై దిశానిర్దేశం చేసింది. జిల్లా కమిటీలను నియమించాలని, పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించింది. డీసీసీ అధ్యక్షుల సమావేశంతోపాటు ప్రచారకమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాలు జరిగాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు పలువురు సీనియర్ నేతలు సమావేశాల్లో పాల్గొన్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను అడిగి తెలుసుకున్నారు. ఏలాంటి చర్యలు తీసుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుంది తదితర అంశాలపై చర్చించారు. బూతు, బ్లాక్, మండల్ స్థాయిల్లో కమిటీలను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం చాలా ముఖ్యమని కుంతియా స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని..లోకసభ ఎన్నికలు వరకు డీసీసీలు పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించారు. ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు.